AP News | అసెంబ్లీ విధానాన్ని తప్పుబడుతూ ఏపీ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడికి వైసీపీ అధినేత జగన్ లేఖ రాయడంపై ఏపీ మంత్రులు విరుచుపడ్డారు. గత ఐదేళ్లు ప్యాలెస్లో కాకుండా ప్రజలతో ఉండి ఉంటే ఇప్పుడు స్పీకర్కు లేఖ రాసే పరిస్థితి వచ్చేది కాదని ఎద్దేవా చేశారు. వైసీపీని జగన్ ఘోరంగా ఓడించినా.. చంద్రబాబు పెద్ద మనసుతో అసెంబ్లీలో గౌరవం కల్పించారని తెలిపారు. అందుకే అర్హత లేకపోయినా సాధారణ ఎమ్మెల్యే అయినప్పటికీ ఆయన వాహనాన్ని అసెంబ్లీ ప్రాంగణంలోకి అనుమతించారని తెలిపారు.
స్పీకర్కు జగన్ లేఖ రాయడం విడ్డూరంగా ఉందని మంత్రి అనగాని సత్యప్రసాద్ అన్నారు. అర్హత లేకపోయినా సాధారణ ఎమ్మెల్యే అయినా సరే జగన్ రెడ్డి వాహనాన్ని అసెంబ్లీ ప్రాంగణంలోకి అనుమతి ఇచ్చారని తెలిపారు. అక్షర క్రమంలో ప్రమాణస్వీకారం చేయాల్సిన వైఎస్ జగన్ను వైసీపీ నేతల అభ్యర్థన మేరకు ముందే ప్రమాణం చేయించారని మంత్రి అనగాని సత్య ప్రసాద్ తెలిపారు. ప్రజలను అతనికి ప్రతిపక్ష స్థానం కూడా ఇవ్వకపోయినా కూడా టీడీపీ మీద పడి ఏడవడం హాస్యాస్పదంగా ఉందని ఎద్దేవా చేశారు.
జగన్ బెదిరింపు రాజకీయాలకు కాలం చెల్లిందని.. ఇకనైనా ప్రజాస్వామ్య పద్ధతిలో రాజకీయాలు చేయాలని మంత్రి గొట్టిపాటి రవికుమార్ విమర్శించారు. అలా చేయకపోతే ఇప్పుడున్న క్రికెట్ టీమ్ కాస్త వాలీబాల్ టీమ్ అవుతుందని కౌంటర్ ఇచ్చారు. ప్రజలు వైసీపీని ఘోరంగా ఓడించినా కూడా.. చంద్రబాబు పెద్ద మనసుతో అసెంబ్లీలో జగన్కు గౌరవం ఇవ్వాలని చెప్పినట్టు గుర్తు చేశారు. అందుకే అర్హత లేకున్నా ఆయనకు అసెంబ్లీలో గౌరవం లభించిందని.. ఆయన వాహనాన్ని లోపలికి అనుమతించారని చెప్పారు.
గత ఐదేళ్లు ప్యాలెస్లో కాకుండా.. ప్రజలతో ఉండి ఉంటే ఇప్పుడు స్పీకర్కు లేఖ రాయాల్సిన పరిస్థితి జగన్కు వచ్చేది కాదని మంత్రి నిమ్మల రామానాయుడు విమర్శించారు. జగన్ సీఎంగా ఉండే అర్హతనే కాదు.. కనీసం ప్రతిపక్ష నేతగా ఉండే అర్హతను కూడా కోల్పోయారని అన్నారు. ప్రజలు అలాంటి తీర్పు ఇచ్చారని.. జగన్ ఇప్పటికైనా తన తప్పులు తెలుసుకోలేకపోతే భవిష్యత్తులో మరింత నష్టపోవాల్సి ఉంటుందని స్పష్టం చేశారు.