ఈవీఎంల ధ్వంసం తప్పుకాదని జగన్ అనడం సరికాదని మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. జగన్ వ్యాఖ్యలపై ఎన్నికల కమిషన్ సుమోటోగా కేసు పెట్టాలని కోరారు. ఓటమి నుంచి పాఠాలు నేర్చుకోకుండా ప్రజలను జగన్ తప్పుబడుతున్నారని మండిపడ్డారు. ప్రజలపై నిందలు వేయడం సరికాదని హితవుపలికారు. జగన్ ఇలాగే ఉంటే మొన్నటి ఎన్నికల్లో రెండంకెలే మిగిలాయని.. భవిష్యత్తులో ఒక సంఖ్య మాత్రమే మిగులుతుందని ఎద్దేవా చేశారు.
జలవనరుల శాఖను గాడిలో పెడతామని మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. జలవనరుల శాఖ అధికారులతో శుక్రవారం ఆయన సమీక్ష నిర్వహించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. గతంలో గుండ్లకమ్మ, పులిచింతల గేట్లు కొట్టుకుపోయాయని గుర్తుచేశారు. గత ప్రభుత్వం కాల్వల్లో మట్టి కూడా తీయలేదని ఆరోపించారు. రైతులకు సాగునీరు అందించే విషయంలో ప్రణాళికతో ముందుకెళ్తున్నామని పేర్కొన్నారు. కృష్ణా డెల్టా ఆయకట్టుకు ఆగస్టులోపు సాగునీటిని ఇవ్వడం సాధ్యం కాదని తెలిపారు. ఖరీఫ్కు అవాంతరాలు లేకుండా చూస్తామని స్పష్టం చేశారు.
ప్రతి రిజర్వాయర్లో జగన్ నిర్లక్ష్యం కనిపిస్తోందని మంత్రి నిమ్మల అన్నారు. పులిచింతల ప్రాజెక్టులో గతంలో 40 టీఎంసీలు నిల్వ ఉంచుకుని వాడుకునే వాళ్లమని.. ప్రస్తుతం అర టీఎంసీ కూడా లేదని తెలిపారు. పట్టిసీమ ద్వారా కృష్ణా డెల్టాకు కొంచెం తాగు, సాగు నీరు ఇవ్వగలుగుతున్నామని చెప్పారు. జగన్ పాలనలో ఇరిగేషన్ డిపార్ట్మెంట్ బాగా నష్టపోయిందని తెలిపారు. అసమర్థ పాలన వల్ల సాగునీటి ప్రాజెక్టులు 20 ఏళ్లు వెనక్కి వెళ్లాయని అన్నారు.