Gudivada | వైసీపీ పాలనలో గుడివాడలో గడ్డం గ్యాంగ్ దోపిడీకి పాల్పడిందని ఏపీ మంత్రి నారా లోకేశ్ ఆరోపించాడు. నీ దోపిడీకి హద్దు లేదా? ప్రజాధనాన్ని పందికొక్కులా మెక్కడానికి సిగ్గులేదా? అని జగన్ను ప్రశ్నించారు. గతంలో టిడ్కో కాలనీ ప్రారంభోత్సవ సభలో నిమ్మకాయ నీళ్లను సరఫరా చేసినందుకు రూ.28 లక్షలు అయ్యిందని బిల్లులు చూపిస్తూ కొడాలి నాని అక్రమంగా డబ్బులు కాజేరంటూ వస్తున్న వార్తలపై నారా లోకేశ్ మండిపడ్డారు.
జనం సొమ్ము అయితే చాలు నిమ్మకాయ నీళ్లలా 28 లక్షలు దిగమింగేశావని జగన్పై నారా లోకేశ్ మండిపడ్డారు. వైసీపీ పాలనలో గడ్డం గ్యాంగ్ గుడివాడలో టిడ్కో ఇళ్ల ప్రారంభోత్సవానికి నిమ్మకాయ నీళ్ల కోసమంటూ జనం సొమ్ము 28 లక్షలు దోచేసిందని చెప్పారు. ఆ టిడ్కో ఇల్లు ఒక్కో పేదవాడికి మంజూరు చేయడానికి రూ.3 లక్షల నుంచి 4 లక్షలు దండుకున్నారని ఆరోపించారు. గుడివాడ మున్సిపల్ కమిషనర్ సంతకం ఫోర్జరీ చేసి 70 లక్షలు బిల్లులు చేసుకోవడానికి గడ్డం గ్యాంగ్ విశ్వప్రయత్నాలు చేసిందని విమర్శించారు.
అమృత్ పథకం కింద పనులు చేయకుండానే కోట్లు కొల్లగొట్టేశారని నారా లోకేశ్ విమర్శించారు. ఐదేళ్ల జగన్ పాలనలో గడ్డం గ్యాంగ్ గుడివాడ నియోజకవర్గాన్ని గుల్ల చేసిందనడానికి ఇవి కొన్ని ఉదాహరణలు మాత్రమేనని చెప్పుకొచ్చారు.