Kollu Ravindra | ఏపీలో అధికారంలోకి చేపట్టిన కూటమి ప్రభుత్వం మరో హామీ అమలుకు సిద్ధమైంది. ఎన్నికల ముందు సూపర్ సిక్స్ పేరుతో ఇచ్చిన హామీల మేరకు ఇప్పటికే సామాజిక పింఛన్లకు శ్రీకారం చుట్టిన చంద్రబాబు .. తాజాగా మరో హామీ అమలుకు గ్రీన్సిగ్నల్ ఇచ్చారు. జూలై 8వ తేదీ నుంచి ఏపీలో ఉచిత ఇసుక విధానం అమల్లోకి తీసుకురావాలని నిర్ణయించారు. ఈ మేరకు ఉచిత ఇసుక విధానానికి సీఎం చంద్రబాబు నాయుడు ఆమోదం తెలిపారు. ఈ విషయాన్ని ఏపీ గనుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర వెల్లడించారు.
మళ్లీ ఉచిత ఇసుక విధానాన్ని ప్రవేశపెట్టడం శుభపరిణామమని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. ఉచిత ఇసుక పాలసీ విధివిధానాలు రూపొందించాలని చంద్రబాబు ఆదేశించారని తెలిపారు. ప్రతి ఒక్కరికీ ఇసుక అందేలా గైడ్లైన్స్ ఇచ్చారని పేర్కొన్నారు. ఇసుక కొరతతో ఎక్కడా నిర్మాణాలు ఆగకూడదని అన్నారు. రీచ్ల నుంచి కావాల్సిన ఇసుక ఉచితంగా తీసుకెళ్లవచ్చని చెప్పారు. ఇకపై ఇసుక కొరత లేకుండా చూస్తామన్నారు. ఇసుకను బ్లాక్ మార్కెట్ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఉచిత ఇసుక విధానాన్ని టీడీపీ ప్రభుత్వమే తీసుకొచ్చిందని.. కానీ వైసీపీ అధికారంలోకి వచ్చాక దాన్ని దోచుకోవడానికే వాడుకుందని తెలిపారు. ఈ పాలసీతో అక్రమాలకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.