Kollu Ravindra | మాజీ మంత్రి, వైసీపీ నేత పేర్ని నానిపై ఏపీ ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. వైసీపీకి రాష్ట్ర ప్రజలు గుణపాఠం చెప్పినప్పటికీ.. పేర్ని నాని వంటి వ్యక్తులకు ఇంకా బుద్ధి రావడం లేదని విమర్శించారు. టీడీపీ అధినేత చంద్రబాబు, జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్పై మంగళవారం పేర్ని నాని చేసిన కామెంట్లపై ఆయన విరుచుకుపడ్డారు. పేర్ని నాని వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పారు.
వైఎస్ జగన్ అరాచకాలకు విసిగిపోయిన ఏపీ ప్రజలు తమకు 95 శాతం సీట్లను ఇచ్చారని కొల్లు రవీంద్ర తెలిపారు. అయినా సరే పేర్ని నాని వంటి నాయకులు కొంతమంది పిచ్చి పిచ్చి ప్రేలాపనలు చేస్తున్నారని విమర్శించారు. వైనాట్ 175 అన్న జగన్ ఉన్నది కూడా ఊడగొట్టుకుని.. ఐదేళ్ల తర్వాత జరగబోయే ఎన్నికల గురించి మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందన్నారు. మచిలీపట్నం ప్రజలు పేర్ని నానిని చెప్పుతో కొట్టినట్లు తీర్పు ఇచ్చానా ఆయన పద్ధతి మార్చుకోవడం లేదని మండిపడ్డారు. పేర్ని నాని ఇలాగే మాట్లాడితే మచిలీపట్నం నుంచి కూడా ప్రజలు తరిమికొడతారని హెచ్చరించారు. ఐదేళ్లలో పేర్ని నాని చేసిన అవినీతిని ప్రజల ముందు పెట్టి.. చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.