వైఎస్ జగన్ ప్రతిపక్ష హోదా అడగడం సిగ్గు చేటు అని దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి విమర్శించారు. జగన్ ఏనాడు కూడా అసెంబ్లీ నియమాలను పాటించలేదని ఆరోపించారు. గ్రామాల్లో కూడా జగన్ పరదాలు కట్టుకుని తిరగారని పేర్కొన్నారు. చంద్రబాబు నాయకత్వంలో కూటమి ప్రభుత్వం పనిచేయడం ప్రారంభమైందని తెలిపారు.
ప్రజలు తమపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకోవడమే తమ ప్రభుత్వ ఉద్దేశమని ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు. రాష్ట్రంలో 65 లక్షల పేద కుటుంబాలకు మేలు జరిగేలా సంక్షేమాన్ని అమలు చేస్తామని పేర్కొన్నారు. జూలై 1వ తేదీ నుంచి పింఛన్లు ఇస్తామని తెలిపారు. పింఛన్ల విషయంలో పేదలను వైసీపీ మోసం చేసిందని ఆరోపించారు. రూ.3వేల పింఛన్ ఇస్తామని చెప్పి.. ఐదేళ్ల పాలన చివరలో ఇచ్చారని గుర్తు చేశారు. 4 వేలకు పెన్షన్ పెంచుతామని చెప్పిన చంద్రబాబు.. మొదటి నెల నుంచే అమలు చేస్తుందని తెలిపారు. మూడు నెలల బకాయి డబ్బులను కూడా వేస్తామని చెప్పారు. ప్రభుత్వ రంగ గుర్తింపు పొందిన సచివాలయ ఉద్యోగుల ద్వారానే పెన్షన్లు పంపిణీ చేస్తామని స్పష్టం చేశారు. ఇందుకోసం అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేస్తోందని అన్నారు. గతంలో రూ.2700 కోట్ల నిధులను పెన్షన్ల కోసం వెచ్చిస్తుండగా.. ఇప్పుడు రూ.4400 కోట్ల మేర పెన్షన్లు ఇస్తున్నామని పేర్కొన్నారు. ఎన్టీఆర్ భరోసా పేరుతో పింఛన్లు పంపిణీ చేస్తామని చెప్పారు.
డీఎస్సీకి గత ప్రభుత్వం నీళ్లొదిలిందని ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు. డిసెంబర్లోగా మెగా డీఎస్సీ పూర్తి చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేశామని చెప్పారు. మంత్రి నారా లోకేశ్ ఆధ్వర్యంలో మెగా డీఎస్సీ విజయవంతంగా అమలు జరుగుతుందని ధీమా వ్యక్తం చేశారు.