అమరావతి : ఏపీ ప్రభుత్వం గ్రూప్-2 మెయిన్స్ ( Group-2 Mains) పరీక్షను వాయిదా వేసింది. పాలనాపరమైన కారణాలతో వాయిదా వేసినట్టు్ ఏపీపీఎస్సీ(APPSC) అధికారులు వెల్లడించారు. గ్రూప్-2 మెయిన్స్ పరీక్ష తేదీని తర్వాత వెల్లడిస్తామని ప్రకటించారు. షెడ్యూల్ ప్రకారం ఈనెల 28న పరీక్ష జరగాల్సి ఉంది.
మెగా డీఎస్సీ అభ్యర్థులకు గుడ్న్యూస్
ఏపీలో టీచర్ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు కూటమి ప్రభుత్వం గుడ్న్యూస్ చెప్పింది. టెట్, మెగా డీఎస్సీ పరీక్షలకు ప్రిపేర్ కావడానికి సమయం ఇవ్వాలన్న అభ్యర్థుల వినతిపై ఏపీ ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. టెట్కు 90 రోజులు, డీఎస్సీకి 90 రోజులు సమయం ఇవ్వాలని నిర్ణయించింది.
టెట్, మెగా డీఎస్సీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యేందుకు మరికొంత సమయం ఇవ్వాలని విద్యార్థి, యువజన సంఘాలు ముందు నుంచి సమయం అడుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఆ సంఘాల నేతలు ఇటీవల మంత్రి నారా లోకేశ్ను కలిసి విజ్ఞప్తి చేశారు. దీనికి సానుకూలంగా స్పందించిన నారా లోకేశ్.. విద్యాశాఖ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు.
అభ్యర్థుల వినతిని పరిగణలోకి తీసుకుని.. టెట్, మెగా డీఎస్సీ ప్రిపరేషన్కు సమయం ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. టెట్కు 90 రోజులు, డీఎస్సీకి 90 రోజుల సమయం ఇస్తూ.. మొత్తం ప్రక్రియను ఆరు నెలల్లో నియామక ప్రక్రియ పూర్తిచేసేలా కార్యాచరణ రూపొందించాలని ఉన్నతాధికారులను ఆదేశించారు. ఈ నిర్ణయానికి అనుగుణంగా కొత్త పరీక్ష తేదీలను త్వరలోనే ఏపీ ప్రభుత్వం ప్రకటించనుంది. కాగా, కొత్తగా బీఈడీ, డీఈడీ పూర్తి చేసుకున్న వారికి కూడా మెగా డీఎస్సీలో అవకాశం కల్పించనున్నారు.