AP Govt | అమరావతి : ఆంధ్రప్రదేశ్ ఎన్నికల విధుల్లో పాల్గొన్న ఉద్యోగులకు ఆ రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త వినిపించింది. 2024 సాధారణ ఎన్నికల్లో పాల్గొన్న ఉద్యోగులకు, సిబ్బందికి ఒక నెల అదనపు వేతనం ఇవ్వాలని చంద్రబాబు సర్కార్ నిర్ణయించింది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ సీఈవో అధికారికంగా ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో ఎన్నికల విధుల్లో పాల్గొన్న ఉద్యోగులు, సిబ్బంది హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మరో కీలక నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఇప్పటివరకు సచివాలయ ఉద్యోగులకు ఉన్న ఐదు రోజుల పనిదినాన్ని పొడిగించారు. సచివాలయ ఉద్యోగులతో పాటు హెచ్వోడీల కార్యాలయాల్లో పనిచేసే ఉద్యోగులకు ఈ వెసులుబాటు ఉంటుంది. దీనిపై రెండు రోజుల్లో అధికారిక ఉత్తర్వులు వచ్చే అవకాశం ఉంది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన అనంతరం హైదరాబాద్ నుంచి ఏపీకి వెళ్లిన సచివాలయ ఉద్యోగుల కోసం అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు కొన్ని సదుపాయాలు కల్పించారు. రాజధానిలో ఐదు రోజులు మాత్రమే పనిచేసేలా వెసులుబాటు కల్పించారు. దీనివల్ల సోమవారం నుంచి శుక్రవారం వరకు పనిచేసిన ఉద్యోగులు.. వీకెండ్లో హైదరాబాద్కు వచ్చి తమ కుటుంబాలతో గడిపేందుకు వెసులుబాటు కల్పించారు.
అమరావతి రాజధాని నిర్మాణం పూర్తయ్యే దాకా సచివాలయ ఉద్యోగులకు ఈ వెసులుబాటు కల్పించాలని చంద్రబాబు అనుకున్నారు. కానీ వాళ్లు అధికారంలో ఉన్న తొలి ఐదేళ్లలో ఏపీ రాజధాని నిర్మాణం పూర్తి కాలేదు. జగన్ నేతృత్వంలో వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మూడు రాజధానుల ప్రతిపాదనను తీసుకొచ్చింది. దీంతో ఈ వెసులుబాటును ఎత్తివేయాలని జగన్ అనుకున్నారు. కానీ సచివాలయ ఉద్యోగుల ఒత్తిడితో ఈ వెసులుబాటును కొనసాగించక తప్పలేదు. మూడు రాజధానుల ప్రతిపాదన కారణంగా జగన్ హయాంలో అమరావతి నిర్మాణం ఆగిపోయింది. ఇప్పుడు తిరిగి చంద్రబాబు నేతృత్వంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో మళ్లీ అమరావతిపై ఫోకస్ పెట్టారు. వీలైనంత తొందరగా రాజధానిని పూర్తిచేసే పనిలో పడ్డారు. కాగా, సచివాలయ ఉద్యోగులకు కల్పించిన ఐదు రోజుల పని దినాల వెసులుబాటు త్వరలోనే ముగుస్తుంది. దీంతో ఈ వెసులుబాటును పొడిగిస్తూ తాజాగా చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు.