AP DSC 2024 | ఎన్నికల హామీలో చెప్పినట్లుగా మెగా డీఎస్సీని ప్రకటించేందుకు ఏపీ ప్రభుత్వం సర్కార్ కసరత్తు చేస్తోంది. డీఎస్సీ 2024 నోటిఫికేషన్ను విడుదల కోసం కార్యాచరణ మొదలుపెట్టింది. ఇప్పటికే గత ప్రభుత్వం 6 వేల పోస్టులతో నోటిఫికేషన్ విడుదల చేసి ఉండటంతో.. దాన్ని రద్దు చేసి కొత్త నోటిఫికేషన్ ఇవ్వాలని భావిస్తోంది. అయితే గత ప్రభుత్వం మూడేళ్ల నుంచి టెట్ పరీక్షను నిర్వహించకపోవడంతో.. అందరు అభ్యర్థులకు న్యాయం జరిగేలా డీఎస్సీ నోటిఫికేషన్ ఎలా విడుదల చేయాలనే దానిపై చర్చిస్తోంది. ఈ క్రమంలోనే రెండు రకాలుగా డీఎస్సీ నోటిఫికేషన్ను జారీ చేయాలని ప్రభుత్వం నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది.
ఇప్పటివరకు టెట్ రాయని, క్వాలిఫై కాని అభ్యర్థుల కోసం టెట్ నిర్వహణతో కలిసి ఒక డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయాలని ఏపీ సర్కార్ భావిస్తోందని సమాచారం. అలాగే టెట్ అర్హత పొందిన వారి కోసం నేరుగా మెగా డీఎస్సీకి మరో నోటిఫికేషన్ ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఈ నెల 30వ తేదీన ఈ రెండు నోటిఫికేషన్లు విడుదల చేయనున్నట్లు సమాచారం. డిసెంబర్ 10వ తేదీలోపు పరీక్ష నిర్వహించి, అపాయింట్మెంట్ ఆర్డర్ ఇచ్చేలా మెగా డీఎస్సీ షెడ్యూల్ను రూపొందిస్తుందని సమాచారం. జిల్లాలోని స్థానికులతోనే 80 శాతం టీచర్ పోస్టుల భర్తీకి నిర్ణయం తీసుకున్నారు.
మొత్తంగా 16,347 పోస్టులతో మెగా డీఎస్పీ ప్రకటించేందుకు ఇటీవల ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది. ఇందులో భాగంగా పాఠశాల విద్యాశాఖ పరిధిలో 13,661 పోస్టులు భర్తీ చేయనుంది. అలాగే ఎస్సీ సంక్షేమ శాఖ పరిధిలో 439 టీచర్ పోస్టులు, బీసీ సంక్షేమశాఖ పరిధిలో 170 టీచర్ ఫోస్టులు, ఎస్టీ సంక్షేమ శాఖ పరిధిలో 49 టీచర్ పోస్టులు, విభిన్న ప్రతిభావంతుల సంక్షేమ శాఖ పరిధిలో 49 టీచర్ పోస్టులు, బాల నేరస్థులకు విద్యా బోధన కోసం 15 టీచర్ పోస్టులు భర్తీ చేయనుంది.