Pawan Kalyan | ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తెలంగాణ పర్యటన ఫిక్సయ్యింది. ఈ నెల 29న ఆయన కొండగట్టుకు రానున్నారు. శనివారం నాడు ఉదయం కొండగట్టు ఆంజనేయ స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ప్రస్తుతం పవన్ కల్యాణ్ వారాహి అమ్మవారి దీక్షలో ఉన్నారు. 11 రోజుల పాటు కొనసాగనున్న ఈ దీక్షలో భాగంగా ఆయన కేవలం పండ్లు, ద్రవాహారం మాత్రమే తీసుకోనున్నారు. వారాహి దీక్షలో భాగంగానే పవన్ కల్యాణ్ తమ ఇలవేల్పు అయిన ఆంజనేయ స్వామిని దర్శించుకోనున్నారు.
ఏపీ డిప్యూటీ సీఎం హోదాలో ఆయన కొండగట్టుకు రావడం ఇదే తొలిసారి. గతంలో ఏపీ ఎన్నికల ప్రచారానికి ముందు కూడా కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయానికి వచ్చారు. తన ఎన్నికల ప్రచార రథమైన వారాహికి ఇక్కడే పూజలు చేయించారు. అనంతరం తన వారాహి విజయ యాత్రను కొనసాగించారు. ఇటీవల జరిగిన ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో విజయ దుంధుబి మోగించారు. కూటమి ప్రభుత్వం అధికారంలో రావడంలో కీలక పాత్ర పోషించారు.
కొండగట్టు అంజన్న దర్శనం అనంతరం పవన్ కల్యాణ్ తన సొంత నియోజకవర్గమైన పిఠాపురం పర్యటనకు వెళ్లనున్నారు. జూలై 1వ తేదీన పిఠాపురం నియోజకవర్గంలో పర్యటించి ప్రజల సమస్యలు తెలుసుకుంటారు. అదే రోజు సాయంత్రం వారాహి సభను నిర్వహించి.. తనను గెలిపించిన పిఠాపురం ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేస్తారు. మూడు రోజుల పాటు కొనసాగనున్న పర్యటనలో భాగంగా పవన్ కల్యాణ్ పిఠాపురంతో పాటు.. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాల్లో పలు అధికారిక కార్యక్రమాల్లో పాల్గొంటారు.