Pawan Kalyan | ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ దీక్ష చేయబోతున్నారు. బుధవారం నుంచి ఆయన వారాహి అమ్మవారి దీక్ష తీసుకోనున్నారు. 11 రోజుల పాటు ఈ అమ్మవారి దీక్ష కొనసాగనుంది. ఈ సమయంలో కేవలం పండ్లు, ద్రవాహారం మాత్రమే పవన్ కల్యాణ్ తీసుకుంటారని తెలుస్తోంది.
గత ఏడాది ఎన్నికల ముందుకు వారాహి విజయయాత్ర పేరుతో జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రచారం నిర్వహించారు. ఆ యాత్ర సందర్భంగా కూడా వారాహి అమ్మవారికి పవన్ కల్యాణ్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అప్పుడు కూడా వారాహి దీక్ష చేపట్టారు.
అసలు వారాహి అమ్మవారు ఎవరు?
పురాణాల ప్రకారం దుర్గా మాతకు ఏడు ప్రతిరూపాలుగా సప్త మాతృకలు ఉంటారు. ఆ సప్త మాతృకలో ఒకరు వారాహి అమ్మవారు. అంధకాసురుడు, రక్తబీజుడు, శంభునిశంభు.. వంటి పలువురు రాక్షసులను సంహరించడంలో వారాహి అమ్మవారి ప్రస్తావన ఉంటుంది. అమ్మవారి రూపం వరాహం ముఖంతో ఎనిమిది చేతులు కలిగి ఉంటుంది. చేతుల్లో పాశం, నాగలి, శంఖ చక్రాలు వంటి ఆయుధాలను పట్టుకుని ఉంటుంది. గుర్రం, పాము, దున్నపోతు, సింహం అమ్మవారి వాహనాలుగా పురాణాల్లో చెబుతుంటారు.