Pawan Kalyan | తనను అసెంబ్లీ గేటు కూడా తాకనీయమని వైసీపీ నేతలు అన్నారని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. గత ఎన్నికల్లో ఇచ్చిన విజయంతో అసెంబ్లీ గేటు తాకడం కాదు.. గేటు బద్ధలు కొట్టుకుని అసెంబ్లీలోకి వెళ్లామని పేర్కొన్నారు. కాకినాడ పర్యటనలో ఉన్న ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. ఉప్పాడలో నిర్వహించిన వారాహి బహిరంగ సభలో ప్రసంగించారు. ఈ సందర్భంగా ప్రజల సమక్షంలో ఆయన మళ్లీ ఎమ్మెల్యేగా ప్రమాణం చేశారు.
2019లో జనసేన ఉనికి నిలబెట్టారని.. 2024లో గుర్తింపు ఇచ్చారని పవన్ కల్యాణ్ తెలిపారు. ఎన్నికల్లో ఎవరూ ఊహించని ఘన విజయం అందించారని తెలిపారు. దానికి పిఠాపురం నుంచే బీజం పడిందని అన్నారు. పిఠాపురం ఇచ్చిన బలం దేశ రాజకీయాల్లో మాట్లాడుకునేలా చేసిందని తెలిపారు. వంద శాతం స్ట్రయిక్ రేటు విజయం మామూలు విషయం కాదని అభిప్రాయపడ్డారు. కావాలనే తాను పంచాయతీరాజ్ శాఖ తీసుకున్నానని ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం వివరించారు. ఈ సందర్భంగా ఆయన ఎమ్మెల్యేగా ప్రజల ముందు ప్రమాణం చేశారు. అన్ని వర్గాలు, మతాలు, కులాల వారీగా హామీ ఇస్తున్నా.. మానవత్వాన్ని కాపాడుతా.. మీ అభ్యున్నతికి కష్టపడతా.. లంచాలు తీసుకుని పాలన మీకు అందిస్తా అని పవన్ కల్యాణ్ ప్రజల ముందు ప్రమాణం చేశారు.
పవన్ కల్యాణ్ ఆంధ్రాలో ఉండరని వైసీపీ నేతలు చేసిన విమర్శలను పవన్ కల్యాణ్ గుర్తుచేశారు. ఇప్పుడు తాను పిఠాపురం వాస్తవ్యుడిగా మారానని కౌంటర్ ఇచ్చారు.. పిఠాపురంలో మూడెకరాల భూమి కొన్నానని వెల్లడించారు. ప్రభుత్వ ఉద్యోగులను గౌరవిస్తానని తెలిపారు. ప్రజాప్రతినిధులంతా అధికారులకు గౌరవం ఇవ్వాలని సూచించారు. ఎవరైనా పార్టీపరంగా వారిపై దౌర్జన్యం చేస్తే క్రమశిక్షణ చర్యలు తప్పవని హెచ్చరించారు.