AP News | ఆంధ్రప్రదేశ్ సీఎస్ నీరభ్కుమార్ ప్రసాద్ పదవీకాలాన్ని కేంద్ర ప్రభుత్వం పొడిగించింది. ఈ మేరకు డీవోపీటీ గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. జూలై 1వ తేదీ నుంచి డిసెంబర్ 31 వ తేదీ వరకు ఆయన సర్వీసును పొడిగిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది.
ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జవహర్రెడ్డిని బదిలీ చేసి నీరభ్కుమార్ను సీఎస్గా నియమించారు. 1987 బ్యాచ్కు చెందిన ఆయన.. సీఎస్ కావడానికి ముందు రాష్ట్ర పర్యావరణ, అటవీ, శాస్త్ర, సాంకేతిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు.
1988లో పశ్చిమ గోదావరి జిల్లాలో ట్రైనీ అసిస్టెంట్ కలెక్టర్గా తన ప్రయాణాన్ని నీరభ్కుమార్ మొదలుపెట్టారు. 1990లో తూర్పు గోదావరి సబ్ కలెక్టర్గా పనిచేశారు. 1991లో ఏటూరు నాగారం పీవో ఐటీడీఏ, 1992లో కృష్ణా జిల్లా పీడీ ఆర్డీఏగా పనిచేశారు. 1993లో కృష్ణా జిల్లా జాయింట్ కలెక్టర్గా, 1996లో ఖమ్మం కలెక్టర్గా, 1998లో చిత్తూరు కలెక్టర్గా సేవలు అందించారు. 1999లో యువజన సంక్షేమశాఖ డైరెక్టర్, శాప్ ఎండీగా పనిచేశారు. 2000లో కేంద్ర సర్వీసులకు డిప్యూటేషన్పై వెళ్లారు.
2005లో రాష్ట్ర పాడి పరిశ్రమాభివృద్ధి సంస్థ ఎండీగా, 2007లో పరిశ్రమల శాఖ కమిషనర్గా, 2009లో మత్స్యశాఖ కమిషనర్గా సేవలు అందించారు. 2012లో రాష్ట్ర మున్సిపల్ పరిపాలన, పట్టణాభివృద్ధి సంస్థ కమిషనర్గా బాధ్యతలు చేపట్టారు. రాష్ట్ర విభజన అనంతరం 2014లో జీఏడీ ముఖ్య కార్యదర్శిగా, 2015లో వైఏటీసీ ముఖ్య కార్యదర్శిగా పనిచేశారు. 2017లో కార్మిక ఉపాధి కల్పన, శిక్షణ శాఖ ముఖ్య కార్యదర్శిగా విధులు నిర్వర్తించారు. 2018లో టీఆర్అండ్బీ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా, 2019లో రాష్ట్ర పర్యావరణ, అటవీ, శాస్త్ర, సాంకేతిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. ప్రస్తుతం ఏపీ సీఎస్గా కొనసాగుతున్నారు.