CM Chandrababu | హైదరాబాద్, జూలై 1 (నమస్తే తెలంగాణ): ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్రెడ్డికి సోమవారం లేఖ రాశారు. రాష్ట్ర విభజన సమస్యలను చర్చల ద్వారా పరిష్కరించుకుందామని పేర్కొన్నారు. రాష్ట్ర విభజన జరిగి పదేండ్లయినా రెండు రాష్ర్టాల మధ్య కొన్ని సమస్యలు అపరిష్కృతంగా మిగిలాయని తెలిపారు.
విభజన హామీల పరిష్కారం ద్వారా.. పరస్పర సహకారం, తెలుగు రాష్ర్టాల అభివృద్ధికి దోహదపడుతుందని పేర్కొన్నారు. ఈ నెల 6న హైదరాబాద్లో ముఖాముఖి సమావేశమై చర్చించుకుందామని ప్రతిపాదించారు. ఇరు రాష్ర్టాల మధ్య సామరస్యం, పరస్పర సహకారం ఉంటేనే ప్రభుత్వాల లక్ష్యాలు నెరవేరి అభివృద్ధి సాధించగలుగుతామని పేర్కొన్నారు.