అమరావతి : ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు (AP CM Chandrababu) బుధవారం అమరావతి (Amaravati) రాజధానిపై శ్వేతపత్రాన్ని(White Paper) విడుదల చేశారు. రాష్ట్రం పునర్నిర్మాణం కోసం కేంద్రంతో అన్ని విషయాలు చర్చిస్తానని తెలిపారు. అమరావతి పనులు వెంటనే పనులు ప్రారంభిస్తామని వెల్లడించారు.
విజయవాడ, గుంటూరు మధ్య రాజధాని ఉండాలని కమిటీ చెప్పిన మీదట అమరావతికి శంఖుస్థాపన చేపట్టి, పనులను ప్రారంభించామని చంద్రబాబు పేర్కొన్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద భూసేకరణ ప్రాజెక్టు అమరావతని పేర్కొన్నారు. 29వేల మంది రైతులు 34,400 ఎకరాలు అమరావతి కోసం భూములిచ్చారని,తెలిపారు. రైతులు ఇచ్చిన భూమికి ఏటా పరిహారం ఇచ్చామని అన్నారు.
జగన్(Jagan) అధికారంలోకి వచ్చిన తరువాత రాష్ట్రాన్ని భ్రష్టుపట్టించారని ఆరోపించారు. జగన్ ప్రభుత్వ అరాచక పనుల వల్ల అమరావతి ధ్వంసమైందని పేర్కొన్నారు. అమరావతిలో భవనాలు, నిర్మాణ సామగ్రి పాడయ్యాయని అన్నారు. జగన్పై నమ్మకం లేక పెట్టుబడిదారులు వెనక్కి వెళ్లిపోయారని, అమరావతి నుంచి ఉపాధి కోసం ఇతర ప్రాంతాలకు వలస వెళ్లారని తెలిపారు. ప్రజా రాజధాని అమరావతిని నిర్మించి ఉపాధి కల్పన, సంపదను సృష్టించి, పేదరక నిర్మూలనే ధ్యేయంగా ముందుకు సాగుతామని చంద్రబాబు అన్నారు.