Andhra University | ఆంధ్రా యూనివర్సిటీ వీసీ ప్రసాదరెడ్డి, రిజిస్ట్రార్ స్టీఫెన్సన్ తమ పదవులకు రాజీనామా చేశారు. గత ఐదేండ్లలో యూనివర్సిటీని వీసీ, రిజిస్ట్రార్ భ్రష్టు పట్టించారని విద్యార్థి సంఘాలు, ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇన్ఛార్జి రిజిస్ట్రార్ ప్రొ.కిశోర్బాబుకు బాధ్యతలు అప్పగించారు.
వీసీ ప్రసాదరెడ్డి యూనివర్సిటీ వైసీపీ కార్యాలయంగా మార్చేశారని టీడీపీ, జనసేన నేతలు కొద్దిరోజులగా విమర్శిస్తున్నారు. అలాగే వైసీపీ గెలుపు కోసం పరిశోధకులను ఉపయోగించుకున్నారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. ఈ క్రమంలోనే ఏపీలో ప్రభుత్వం మారినప్పటికీ ఇంకా ఆంధ్రా యూనివర్సిటీలోని వీసీ కార్యాలయంలో ఇప్పటివరకు సీఎం చంద్రబాబు ఫొటోను పెట్టలేదు. మాజీ సీఎం వైఎస్ జగన్ ఫొటోనే ఇంకా కార్యాలయంలో ఉంచారు. ఈ విషయం తెలుసుకున్న విద్యార్థి సంఘాలు గురువారం ఆందోళనకు దిగాయి. టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు ప్రణవ్ గోపాల్ ఆధ్వర్యంలో వీసీ కార్యాలయం ఎదుట నిరసనలు చేపట్టారు. వీసీ చాంబర్లో తక్షణమే సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఫొటోలు ఏర్పాటు చేయాలని, ప్రసాదరెడ్డి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. పైగా రాజీనామా చేయాలని ప్రసాదరెడ్డికి కొద్దిరోజులగా బెదిరింపు కాల్స్ కూడా వస్తున్నట్లు తెలిసింది. ఈ నేపథ్యంలోనే వీసీ పదవికి ప్రసాదరెడ్డి రాజీనామా చేశారు.
కాగా, ఆంధ్రా యూనివర్సిటీలో పరిస్థితిపై అంతకుముందు టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు సోషల్ మీడియా వేదికగా స్పందించారు. ఓయూ అంటే ప్రపంచవ్యాప్తంగా మంచి గుర్తింపు ఉండేదని తెలిపారు. దేవాలయంలాంటి యూనివర్సిటీని జగన్ భ్రష్టు పట్టించారని విమర్శించారు. కరుడుగట్టిన వైసీపీ వాదిని వీసీగా నియమించారని ఆరోపించారు. ఆయన గాంధీ విగ్రహం పక్కనే వైఎస్ విగ్రహం పెట్టించారని, యూనివర్సిటీని జగన్ పార్టీ కార్యాలయంగా మార్చేశారని విమర్శించారు. సీఎం చంద్రబాబు సారథ్యంలో వర్సిటీకి పూర్వ వైభవం తీసుకొస్తామని స్పష్టం చేశారు.