AP Cabinet | ఏపీ కేబినెట్ సమావేశం సీఎం చంద్రబాబు అధ్యక్షతన సమావేశం జరిగింది. అనంతరం మంత్రి కొలుసు పార్థసారథి అనంతరం మీడియా సమావేశం నిర్వహించారు. కేబినెట్ నిర్ణయాలను మీడియాకు వివరించారు. ఎన్నికలకు ముందు చంద్రబాబు, పవన్ కల్యాణ్, బీజేపీ ఎన్నికల వేళ ఏం చెప్పారో అవన్నీ భేటీలో చర్చించామన్నారు. అధికారంలోకి రాగానే మెగా డీఎస్సీ వేస్తామని చెప్పి.. అందుకు అనుగుణంగా 16,347 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి ఆమోదం తెలిపినట్లు చెప్పారు. ప్రతి ఆరు నెలలకోసారి టెట్ను నిర్వహించాల్సి ఉండగా.. గత ప్రభుత్వం నిర్వహించకపోవడంతో నిరుద్యోగులు నష్టపోయేలా వ్యవహరించిందన్నారు. 80శాతం డీఎస్సీ మార్కులు, 20శాతం టెట్ మార్కులు కలిపి టీచర్ ఉద్యోగ నియామకాలకు అర్హతగా తీసుకుంటున్నామని.. టెట్ జరుపకపోవడంతో నిరుద్యోగులు టెట్ మార్కులను మెరుగుపరుచుకునే అవకాశం కోల్పోయారన్నారు.
కేబినెట్లో నాణ్యమైన విద్య అందించే విషయంపై సీఎం ప్రస్తావించారని.. అందుకు జాతీయ విద్యా విధానాన్ని పరిశీలించి.. విద్యా ప్రమాణాలు పొందించాలని ఆదేశించారన్నారు. కేబినెట్లో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్పై సైతం చర్చింమన్నారు. ఈ చట్టాన్ని బీజేపీ అమలు చేశామని గత ప్రభుత్వం చెప్పిందని.. కేంద్రం, నీతి ఆయోగ్ ప్రతిపాదించిన చట్టం, అప్పటి ప్రభుత్వం ఆమోదించిన చట్టానికి తీవ్రమైన వైరుధ్యాలు ఉన్నాయన్నారు. అలాగే, కేబినెట్లో పెన్షన్ పెంపుపై సైతం కేబినెట్లో నిర్ణయం తీసుకున్నామన్నారు. 65.03లక్షల మందికి లబ్ధి చేకూరేలా పెన్షన్ల పెంపునకు కేబినెట్ ఆమోదం తెలిపిందన్నారు. పెన్షన్ల పెంపుతో ప్రభుత్వంపై నెలకు రూ.810కోట్ల భారం పడుతుందన్నారు. సచివాలయ ఉద్యోగులే లబ్ధిదారుల ఇండ్లకు వెళ్లి పెన్షన్లు అందిస్తారని.. వలంటీర్ల అంశంపై చర్చించామని.. వారిని ఎలా ఉపయోగించుకోవాలనే విషయంపై త్వరలో ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంనద్నారు.
రాష్ట్రంలో స్కిల్ సెన్సస్ చేపట్టనున్నట్లు తెలిపారు. అలాగే అన్న క్యాంటీన్ల పునరుద్ధరణకు కేబినెట్ నిర్ణయించిందన్నారు. తొలుత 123 క్యాంటీన్లను పునరుద్ధరిస్తారని.. మిగతా వాటిని త్వరలోనే పునరుద్ధరించనున్నట్లు తెలిపారు. త్వరలోనే టెండర్లు ఖరారు చేయనున్నట్లు చెప్పారు. వైద్య ఆరోగ్య విశ్వ విద్యాలయానికి ఎన్టీఆర్ పేరును పునరుద్ధరించనున్నట్లు తెలిపారు. ఏజీగా శ్రీరామ్, అదనపు ఏజీగా పొన్నవోలు సుధాకర్రెడ్డి రాజీనామా చేయడంతో ఆయా పదవులు ఖాళీగా ఉన్నాయని.. ఏజీగా దుమ్మాలపాటి శ్రీనివాస్ నియామకానికి కేబినెట్ ఆమోదం తెలిపిందన్నారు. గంజాయి వ్యాప్తిని అరికట్టేందుకు మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు చేశామని.. కార్పొరేషన్లలో పారిశుధ్యం మెరుగుపరిచేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని కేబినెట్ నిర్ణయించిందన్నారు. అమరావతి రాజధాని, పోలవరం, విద్యుత్, శాంతిభద్రతలు తదితర అంశాలపై జూన్ నుంచి జూలై 18 వరకు శ్వేతపత్రాలు విడుదల చేయనున్నట్లు మంత్రి వివరించారు.