Srisailam | శ్రీశైలం భ్రమరాంబిక మల్లికార్జున స్వామి దేవస్థానం యూఫి థియేటర్ సమీపంలో పురాతన శివలింగం బయటపడింది. సీసీ రోడ్డు సపోర్ట్ వాల్ నిర్మాణానికి జేసీబీతో చదును చేస్తుండగా శివలింగం ఆకారం చెక్కిన ఒక రాయి కనిపించింది. అదే రాయిపై నంది విగ్రహం కూడా ఉండటం విశేషం.
శివలింగం కనిపించిన రాయిపై ఏదో శాసనం రాసి ఉండటాన్ని ఆలయ అధికారులు గుర్తించారు. దీంతో శివలింగం ఉన్న రాయిపై కనిపించిన ఆ లిపిని తెలుసుకునేందుకు మైసూరుకు చెందిన ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ అధికారులను సంప్రదించారు. ఆ లిపిని పరిశీలించిన ఆర్కియాలజీ అధికారులు.. అది 14, 15వ శతాబ్దానికి చెందిన తెలుగు లిపిగా గుర్తించారు. బ్రహ్మపురికి చెందిన సిద్ధదేవుని శిష్యుడైన నిండ్రకు చెందిన కంపిలయ్య శివలింగాన్ని చక్ర గుండం వద్ద ప్రతిష్టించినట్లు ఆ శాసనంలో ఉందని ఆర్కియాలజీ అధికారులు తెలిపారు.
శ్రీశైలం మల్లన్నను దర్శించుకున్న సుప్రీంకోర్టు న్యాయమూర్తి
శ్రీశైలం భ్రమరాంబిక మల్లికార్జున స్వామి వారిని సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఎస్.వెంకటనారాయణ భట్టి దర్శించుకున్నారు. శుక్రవారం ఉదయం శ్రీశైలం చేరుకున్న న్యాయమూర్తికి ఏఈవోలు హరిదాస్, మోహన్, ఇతర అధికారులు ఆయనకు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. శ్రీభ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఎస్.వెంకటనారాయణరెడ్డికి ఆలయ పండితులు వేద ఆశీర్వచనం చేసి ప్రసాదాలు, జ్ఞాపికను అందజేశారు.