అమరావతి : జమ్ముకశ్మీర్(Jammakahmir ) లో మరణించిన వీరజవాన్ రామకృష్ణారెడ్డి మృతదేహానికి మంగళవారం సైనిక లాంఛనాల మధ్య అంత్యక్రియలు పూర్తయ్యాయి. లద్దాఖ్(Laddakh) ప్రాంతంలో నాలుగురోజుల క్రితం టీ-72 యుద్ధట్యాంకులో నదిని దాటుతుండగా ఆకస్మికంగా వచ్చిన వరదలో ఐదుగురు సైనికులు కొట్టుకుపోయి మృతి చెందారు. వీరిలో ముగ్గురు ఏపీకి చెందిన ముగ్గురు జవాన్లు రామకృష్ణారెడ్డి, ఎస్. నాగరాజు, సుభాన్ఖాన్ ఉన్నారు.
జవాన్ జేసీవో రామకృష్ణారెడ్డి ( Ramakrishna reddy) మృతదేహాన్ని సంఘటన స్థలం నుంచి ప్రత్యేక విమానం(Special Flight) లో నిన్న రాత్రి విజయవాడకు తీసుకొచ్చి అక్కడి నుంచి రోడ్డు మార్గాన సొంత గ్రామమైన ప్రకాశం జిల్లా రాచర్ల మండలం కాలువపల్లి గ్రామానికి తరలించారు.
మంగళవారం సైనిక లాంఛనాల మధ్య అంతిమ సంస్కారాలు నిర్వహించారు. ఈ సందర్భంగా అంతిమయాత్ర దారిపొడవునా ప్రజలు పూలు చల్లుతూ నివాళి అర్పించారు. ఎమ్మెల్యే ముత్తుమల అశోక్రెడ్డి, మాజీ ఎమ్మెల్యే నాగార్జున రెడ్డి, సబ్ కలెక్టర్ రాహుల్ మీనా, మాజీ సైనికులు పుష్పగుచ్ఛాలు ఉంచి నివాళి అర్పించారు.