తిరుమల : తిరుమల శ్రీవారి భక్తులను మోసగిస్తున్న దళారులను కనిపెట్టి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని టీటీడీ ఈవో జె.శ్యామలరావు (TTD EO ) జిల్లా ఎస్పీని కోరారు. తిరుపతి టీటీడీ పరిపాలనా భవనం సమావేశ మందిరంలో బుధవారం జిల్లా పోలీస్(Police), టీటీడీ నిఘా , భద్రత విభాగం అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు.
భక్తులకు(Devotees) అవసరమైన వసతి, దర్శనం, ఆర్జితసేవ టికెట్లకు సంబంధించి భక్తులను మోసగిస్తున్న దళారులను(Brokers) ఉపేక్షించరాదన్నారు. తిరుమలలో ఐటీ అనుబంధంగా ఉన్న కేసులను సత్వర పరిష్కారానికి సైబర్ క్రైమ్ టీం(Cyber Crime Team) ఏర్పాటును పరిశీలించాలని ఆదేశించారు. ఆన్లైన్ , డిప్ సిస్టం , రిజిస్ట్రేషన్, దొంగతనం , మధ్యపానం, నకిలీ వెబ్సైట్లపై కేసుల నమోదును పోలీసులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు.
వారంలోగా కేసుల్లో ఉన్న దళారులకు చట్టపరంగా శిక్షలు పడేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. కేసుల సత్వర పరిష్కారానికి టీటీడీ విజిలెన్స్, పోలీస్ విభాగాలు తరచూ సమావేశం కావాలన్నారు. ఈ సమావేశంలో తిరుపతి జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు, టీటీడీ జేఈవోలు గౌతమి, వీరబ్రహ్మం, తిరుమల అదనపు ఎస్పీ విమల కుమారి, డీఎస్పీ శ్రీనివాస ఆచారి, టీటీడీ వీజీవో, అధికారులు పాల్గొన్నారు.