అమరావతి : ఆంధ్రప్రదేశ్ ఎలిబిబిలిటీ టెస్ట్ (TET) -2024కు సంబంధించిన ఆన్లైన్ దరఖాస్తుల (Online Applications) ప్రక్రియ గురువారం నుంచి ప్రారంభమయ్యింది. దరఖాస్తుల స్వీకరణ జులై 17 వరకు కొనసాగుతుందని సంబంధిత అధికారులు వెల్లడించారు. త్వరలోనే పరీక్ష తేదీలు వెల్లడిస్తామని అన్నారు. ఏపీలో కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత నిరుద్యోగుల వినతులకు సానుకూలంగా స్పందిస్తుంది.
ఇందులో భాగంగా టెట్ పరీక్షకు, డీఎస్సీ(DSC) పరీక్షలకు సన్నద్ధం కావడానికి సమయం కావాలని అభ్యర్థుల విజ్ఞప్తి మేరకు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ (Minister Nara Lokesh) స్పందించారు. టెట్, డీఎస్సీ పరీక్షల మధ్య కొంత సమయం పొడగించి పరీక్షల తేదీని త్వరలో వెల్లడించనున్నారు. దరఖాస్తు రుసుముల చెల్లింపులకు ఈనెల 16వ తేదీ వరకు ఆఖరు తేదీగా నిర్ణయించారు.
కొత్తగా బీఈడీ, డీఎడ్ పూర్తి చేసుకున్న వారికి కూడా మెగా డీఎస్సీలో అవకాశం కల్పించడం పట్ల అభ్యర్థులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల ముందు వైసీపీ ప్రభుత్వం 6వేల పోస్టులతో ప్రకటించిన డీఎస్సీ నోటిఫికేషన్(Notification) ను చంద్రబాబు సర్కార్ రద్దు చేసిన సంగతి తెలిసిందే. బదులుగా 16,347 పోస్టులకు మెగా డీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుంది. అయితే రద్దైన గత డీఎస్సీకి దరఖాస్తు చేసిన వారికి మెగా డీఎస్సీలో ఫీజు మినహాయింపునిచ్చింది.