తిరుమల : శ్రీవారి భక్తులకు టీటీడీ (TTD) అందిస్తున్న ఆన్లైన్ అప్లికేషన్ సేవలకు ఆధార్ను లింక్(Aadhaar link ) చేయడం ద్వారా పారదర్శకతతో పాటు దళారీ వ్యవస్థను నియంత్రించేందుకు వీలవుతుందని టీటీడీ ఈవో (TTD EO) జె.శ్యామలరావు చెప్పారు.
తిరుపతిలోని టీటీడీ పరిపాలన భవనంలో శనివారం యూఐడీఏఐ నుంచి వచ్చిన అధికారులు, టీసీఎస్ జియో, టీటీడీ ఐటీ విభాగంతో ఈవో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ ఇదివరకే టీటీడీ దర్శనం, వసతి, ఆర్జిత సేవలు, శ్రీవారి సేవ తదితర సేవలను ఆన్లైన్ ద్వారా భక్తులు బుక్ చేసుకునేందుకు వీలు కల్పిస్తోందన్నారు.
ఈ అప్లికేషన్ల ద్వారా కూడా దళారుల బెడద తప్పడం లేదని, వాటిని నియంత్రించడానికి ఆధార్ లింక్ చేసేందుకు సాధ్యాసాధ్యాలు పరిశీలించి తగు చర్యలు తీసుకోవాల్సిందిగా ఐటీ అధికారులకు సూచించారు. ఆధార్ ద్వారా యాత్రికుల గుర్తింపు, పరిశీలన, బయోమెట్రిక్ (Biometric) వెరిఫికేషన్ ఎలా చేయాలి, ఆధార్ డూప్లికేషన్ ఎలా నిరోధించాలి తదితర అంశాలపై చర్చించారు.
అంతకుముందు ఆధార్ను ఏ విధంగా అప్లికేషన్ లకు లింక్ , తదితర అంశాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. ఈ సమావేశంలో యూఐడీఏఐ డిప్యూటీ డైరెక్టర్ సంగీత, అధికారులు
శ్రీనివాస్, రాజశ్రీ గోపాలకృష్ణ, అనుకూర చౌదరి, సంజీవ్ యాదవ్, టీటీడీ జేఈఓలు వీరబ్రహ్మం, గౌతమి, సీవీ అండ్ ఎస్ఓ నరసింహ కిషోర్, అధికారులు పాల్గొన్నారు.