AP News | ప్రేమించిన అమ్మాయే తనకు సర్వస్వం అనుకున్నాడు ఆ యువకుడు. ఆమె కోసం పెద్దలను ఎదురించి మరీ గుడిలో పెళ్లి చేసుకున్నాడు. కానీ పెద్దలకు తెలియకుండా పెళ్లిపీటలు ఎక్కిన ఆ యువతి.. ప్రేమించిన వాడితోనే ఉంటానని అందరి ముందు ధైర్యంగా చెప్పలేకపోయింది. పెద్దలకు భయపడి మాటమార్చింది. తనను బలవంతంగా తీసుకెళ్లి పెళ్లి చేసుకున్నాడని చెప్పింది. దీంతో గుండెపగిలిన ఆ యువకుడు మనస్తాపంతో ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషాద ఘటన అనంతపురం సమీపంలోని కల్యాణదుర్గంలో చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే.. అనంతపురం జిల్లాలోని కల్యాణదుర్గం పట్టణానికి చెందిన వాసుదత్త అనే యువకుడు తన ఇంటికి సమీపంలో ఉండే ఓ యువతిని కొంతకాలంగా ప్రేమించాడు. ఇద్దరూ పెళ్లి చేసుకోవాలని కూడా అనుకున్నారు. కానీ వాళ్ల ప్రేమకు పెద్దలు ఒప్పుకోలేదు. దీంతో ఇద్దరూ కలిసి సోమవారం పెన్న అహోబిలం వెళ్లి ఎవరికీ తెలియకుండా సీక్రెట్గా పెళ్లి చేసుకున్నారు. అయితే తమ కూతురు కనిపించడం లేదని యువతి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఈ క్రమంలో పోలీస్ స్టేషన్కు వచ్చిన యువతి మాట మార్చింది. వాసుదత్త తనను కొంతకాలంగా ఇబ్బంది పెడుతున్నాడని పోలీసులకు చెప్పింది. ప్రేమను నిరాకరించినప్పటికీ.. తనను బలవంతంగా తీసుకెళ్లి పెళ్లి చేసుకున్నాడని పోలీసుల ముందు పేర్కొంది. దీంతో పోలీసులు వాసుదత్తకు కౌన్సెలింగ్ ఇచ్చి పంపించారు. అయితే ప్రాణంలా ప్రేమించిన అమ్మాయే మోసం చేయడంతో మనస్తాపం చెందిన వాసుదత్త మంగళవారం సాయంత్రం ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్నాడు. ఇది గమనించిన స్థానికులు మంటలు ఆర్పి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ వాసుదత్త మరణించాడు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.