ఆదిలాబాద్, జూన్ 11(నమస్తే తెలంగాణ) : కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న ఆరు గ్యారెంటీ పథకాల కోసం ప్రజలు అవస్థలు పడుతున్నారు. గతేడాది డిసెంబర్ 28వ తేదీన ప్రారంభమైన ప్రజాపాలనలో ఆరు గ్యారెంటీల కోసం దరఖాస్తులు సమర్పించారు. ఆధార్, రేషన్ కార్డు, కరెంటు మీటరు నంబరు, గ్యాస్ సిలిండర్ కనెక్షన్ నంబరు, ఇతర వివరాలతో ధ్రువీకరణ పత్రాలు ఇచ్చారు. జిల్లా వ్యాప్తంగా 1,61,366 మంది 200 యూనిట్ల ఉచిత కరెంటు సరఫరాలో భాగంగా గృహజ్యోతి పథకానికి.. 85,210 మంది మహాలక్ష్మీ పథకంలో భాగంగా రూ.500 సిలిండర్ కోసం తమ వివరాలను అందజేశారు. కానీ.. మొదటి నెలలో సగం మందికిపైగా జీరో బిల్లులు రాకపోవడంతో జనం అధికారులను సంప్రదించారు. మహాలక్ష్మీ పథకంలో భాగంగా రూ.500 సిలిండర్ కూడా రాకపోవడంతో ప్రజలు ఆందోళన చెందారు. వివరాల నమోదులో భాగంగా తప్పులు దొర్లడంతో అర్హులకు జీరో బిల్లులు, రూ.500 సిలిండర్ అందకపోవడంతో ప్రభుత్వం మళ్లీ ప్రజాపాలన కేంద్రాలను ప్రారంభించి దరఖాస్తుల సవరణకు అవకాశం కల్పించింది. దీంతో జనం ప్రజాపాలన కేంద్రాల్లో బారులుదీరి తమ వివరాలను నమోదు చేసుకుంటున్నారు.
ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన కేంద్రాలను మూసివేసింది. కోడ్ ముగిసిన తర్వాత గృహజ్యోతి, మహాలక్ష్మీ పథకం లబ్ధిదారులు 200 యూనిట్ల లోపు ఉచిత విద్యుత్, రూ.500 సిలిండర్ పొందడానికి వీలుగా ప్రజాపాలన కేంద్రాలను తిరిగి ప్రారంభించారు. ఆదిలాబాద్ మున్సిపాలిటీలో ప్రజాపాలన కేంద్రానికి దరఖాస్తులుదారులు వచ్చి తమ వివరాలను అందజేస్తున్నారు. ప్రజాపాలన దరఖాస్తులను ఆన్లైన్ నమోదు సరిగా చేపట్టకపోవడంతో అర్హులైన వారు ఈ పథకాలను దూరమవుతున్నారు. దరఖాస్తులో తమకు వర్తించే పథకాలను సిబ్బంది సరిగా నమోదు చేయలేదు. ప్రజాపాలన కేంద్రాలకు వచ్చిన వారి వివరాలను చూస్తే ఆన్లైన్లో నాట్ అప్లయిడ్ అని చూపిస్తున్నది. ఇలాంటి వారి విషయంలో తాము ఏమీ చేయలేమని, ఎడిట్ అప్షన్ ఇస్తే సవరించే అవకాశాలు ఉన్నాయని సిబ్బంది అంటున్నారు. దీంతో పేదలు చేసేదేమీ లేక వెనుదిరుగుతున్నారు. కూలీ పనులు చేసుకునే తాము రెండు పథకాలకు అర్హులమని మున్సిపల్ అధికారులు, సిబ్బంది నిర్లక్ష్యంగా తమ వివరాలను ఆన్లైన్లో నమోదు చేయడంతో తాము వేల రూపాయలు నష్టపోవాల్సి వస్తుందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతున్నారు.