శ్రీరాంపూర్, మే 10 : పెద్దపల్లి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి, కార్పొరేట్ ఓనర్ వంశీకి కార్మికుల కష్టాలు ఏం తెలుసునని టీబీజీకేఎస్ రాష్ట్ర అధ్యక్షుడు మిర్యాల రాజిరెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం శ్రీరాంపూర్ ప్రెస్క్లబ్లో ఏరియా ఇన్చార్జి పెట్టం లక్షణ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సింగరేణి కార్మికుల ఇబ్బందులను కళ్లారా చూసిన కొప్పుల ఈశ్వర్ వెంటే కార్మికవర్గం నడవాలని ఆయన పిలుపునిచ్చారు.
బీఆర్ఎస్ అధికారంలో ఉండి కూడా బొగ్గు గనుల వేలం, ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం చేసిందని, కార్మికులు చేపట్టిన సమ్మెకు మద్దతు తెలిపిందని, అందుకే సింగరేణి వ్యాప్తంగా బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థుల గెలుపుకోసం యూనియన్ కృషి చేస్తుందన్నారు. గనుల వేలం, ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పార్లమెంట్లో పోరాడేందుకు పెద్దపల్లి బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ను భారీ మెజార్టీతో గెలిపించుకోవాల్సిన అవసరం మనందరిపై ఉందన్నారు. కాంగ్రెస్, బీజేపీ ప్రభుత్వాల విధానాలతోనే సింగరేణిలో కార్మికుల సంఖ్య తగ్గుతూ వచ్చిందన్నారు.
గోల్డెన్ హ్యాండ్ షేక్, స్వచ్ఛంద పదవీ విరమణ పథకాలతో కార్మికులకు డబ్బులు ఎరజూపి బలవంతంగా సంస్థ నుంచి గెంటి వేశారని గుర్తు చేశారు. జాతీయ కార్మిక సంఘాలు సంతకాలు చేసి వారసత్వ ఉద్యోగాలు పోగొట్టారని ఆరోపించారు. వారసత్వ ఉద్యోగాలు రద్దు కావడం వల్ల 60 వేల మంది ఉపాధి కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. కేసీఆర్ కార్మికులపై ప్రేమతో కారుణ్య ఉద్యోగాలు కల్పించారని చెప్పారు. కార్మికుల పెన్షన్ విధానంలో మార్పు చేయాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో టీబీజీకేఎస్ కేంద్ర కమిటీ సభ్యులు కే సురేందర్రెడ్డి, పానగంటి సత్తయ్య, పొగాకు రమేశ్, అన్వేష్రెడ్డి, మహిపాల్రెడ్డి, నాయకులు తిరుమల్రావు, హరీశ్, రవి, పోషం, వెంకట్రెడ్డి, శ్రీనివాసరెడ్డి, టీ నరేశ్ తిరుపతిరెడ్డి పాల్గొన్నారు.