మంచిర్యాల, జూలై 1 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : బెల్లంపల్లి నియోజకవర్గంలోని నెన్నెల, గొల్లపల్లి గ్రామాల శివార్లలోని ప్రభుత్వ భూములను రెవెన్యూ అధికారులు తమ సొంత కష్టార్జితంలా ప్రైవేట్ వ్యక్తులకు ధారాదత్తం చేశారు. ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా వెయ్యి ఎకరాల పై చిలుకు ప్రభుత్వ భూములకు అక్రమంగా పట్టా పాస్బుక్లు జారీ చేసి మరీ అప్పగించగా, సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ‘నెన్నెల గ్రామ శివారులోని 1947 ఎకరాల ప్రభుత్వ భూమిలో 900 ఎకరాలు, గొల్లపల్లి గ్రామ శివారులోని 463 ఎకరాల ప్ర భుత్వ భూమిలో 170 ఎకరాలను ప్రైవేట్ వ్య క్తులకు పట్టాలు చేశారు. వీటికి ఏఆర్సీ (అసెం బ్లీ రివ్యూ కమిటీ) అప్రూవల్గానీ, అసైన్మెంట్ పట్టాలుగానీ.. లేకపోవడం గమనార్హం.
ఈ విషయమై సామాజిక కార్యకర్త ఇందూరి రాం మోహన్రావు 2021లో హైకోర్టులో రెండు ప్రజాప్రయోజన వాజ్యలు దాఖలు చేశారు. ఈ అంశంపై అప్పటి కలెక్టర్ భారతీ హొళికేరిని ఎంక్వయిరీ చేసి రిపోర్టు సమర్పించాలని హైకోర్టు ఆదేశించింది. కలెక్టర్ ఆదేశాల మేరకు బెల్లంపల్లి ఆర్డీవో విచారణ చేసి నెన్నెల శివారులోని 79 సర్వే నంబర్లో 300 ఎకరాలను ధరణిలో డైరెక్ట్గా ఎంట్రీ చేశారని తేల్చారు. 73 సర్వే నంబర్లో 200 ఎకరాలు ఇల్లీగల్ పీవోటీ ద్వారా మొత్తం 152 మందికి పట్టాలు జారీ చేసినట్లు నిర్ధారించారు. గొల్లపల్లి శివారుకు సంబంధించి 22 మంది సర్వే నంబర్లు డైరెక్ట్ ఎంట్రీ చేసి, 16 మందికి ఇల్లీగల్ పీవోటీ ద్వా రా 100 ఎకరాలకు పాస్బుక్లు ఇచ్చినట్లు ఆర్డీవో గుర్తించారు. దాదాపు 600 ఎకరాలను ధరణిలో నమోదు చేసి పాస్బుక్లు ఇచ్చారని, వీరి నుంచి రైతుబంధు డబ్బులు వసూలు చేయాలని అప్పటి కలెక్టర్కు రిపోర్ట్ చేశారు.
ఆర్డీవో రిపోర్ట్ ఇచ్చినా.. ఆ భూములపై తీసుకున్న రైతుబంధునుగానీ, బ్యాంక్లోన్ గానీ రెవెన్యూ అధికారులు, అగ్రికల్చర్ అధికారులు, బ్యాంకు వాళ్లు ఇప్పటి వరకు రికవరీ చేయలేదు. పైగా, వీరికి యేటా రైతుబంధు ద్వారా రూ.60 లక్షలు పడుతుంటే చోద్యం చూస్తున్నారు. ప్రభుత్వ భూమిని ఆక్రమించుకున్న వారికి రైతుబంధుతో పాటు బ్యాంకు రుణాలు కూడా ఇచ్చారు. ప్రభుత్వ ఖజానాకు లక్షలాది రూపాయలు గండి పడుతున్నా చర్యలు తీసుకోకపోవడంలో ఆంతర్యమేమిటో అర్థం కావడం లేదు. నెన్నెల మండలంలో 1987 నుంచి 2018 వరకు తహసీల్దార్లుగా పని చేసిన వారంతా అక్రమ పట్టా పాస్ బుక్లు జారీ చేసిన లిస్టులో ఉన్నట్లు ప్రభుత్వ ఎంక్వైరీలోనే తేలింది.
ఆదాయ మార్గాలను అన్వేషించడంపై దృష్టి పెట్టిన సర్కారు ఇల్లీగల్ పట్టాలు జారీ చేసిన అధికారులపై చర్యలు తీసుకొని, భూములను తిరిగి స్వాధీనం చేసుకుంటే కోట్లాది రూపాయలు మిగిలినట్లే కదా అనే అభిపాయ్రాలు వ్యక్తం అవుతున్నాయి. గతంలో ఇదే సామాజిక కార్యకర్త రాంమోహన్రావు 2017లో హైకోర్టులో పిల్ వేసినప్పుడు అప్పటి కలెక్టర్ ఇదే నెన్నెల మండలంలో 88 మంది అనర్హులకు 207 ఎకరాలకు అక్రమంగా పట్టాలు జారీ చేసినట్లు గుర్తించారు. హైకోర్టు నివేదిక సమర్పించడంతో పాటు పట్టాలను రద్దు చేశారు. ఈ వ్యవహారంలో ఓ అధికారి సహా, ధరణి ఆపరేటర్పై చర్యలు తీసుకున్నారు. అనంతరం వేసిన రెండు పిల్స్లోనూ బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడే విచారణ జరిగింది. అనంతరం ఎన్నికలు రావడంతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఈ విషయాన్ని సీరియస్గా తీసుకోవడం లేదు. పైగా ఇప్పుడు ఆ 207 ఎకరాల్లోనూ కొందరి పేర్లను మళ్లీ ధరణిలోకి ఎక్కించి రైతుబంధు (రైతు భరోసా) ఇస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి.
నేను ప్రభుత్వ భూముల రక్షణ కోసం పోరాటం చేస్తున్నా. సామాజిక కార్యకర్తగా 2017లో రేవంత్రెడ్డి (ప్రస్తుత ముఖ్యమంత్రి)ని కలిశా. నా దగ్గరున్న సమాచారం తెలుసుకున్న ఆయన అడ్వకేట్ టీ. రజినీకాంత్రెడ్డి ద్వారా పిల్స్ వేయించారు. అలా 2017లో వేసిన పిల్లో 207 ఎకరాల ప్రభుత్వ భూమికి ఇల్లీగల్ పట్టాలు చేసినట్లు తేలింది. 2021లో 1070 ఎకరాలకు సంబంధించి రెండు పిల్స్ వేశాను. కలెక్టర్ విచారణ చేసి రిపోర్ట్ ఇచ్చారు తప్పితే ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకోలేదు. పైగా 2017లో అక్రమమని గుర్తించిన పట్టాలకు సైతం ఇప్పుడు రైతుబంధు(రైతు భరోసా) ఇస్తున్నారు. ఇదే విషయాన్ని ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి దృష్టికి తీసుకువెళ్దామంటే దారి దొరకడం లేదు. 2017, 2021లో ఆయన ఇంటి దగ్గరకు వెళ్తే కలిసి మాట్లాడారు.
ఇప్పుడు వాళ్ల పీఏని అడిగితే కలవడం వీలుపడదు అంటున్నారు. అడ్వకేట్ రజినీకాంత్రెడ్డి ఏమో ఎన్వోసీ ఇస్తా అంటున్నారు. నన్ను మధ్యలో వదిలేశారు. నా జీవిత కాలం మొత్తం ఈ భూములకు సంబంధించిన సమాచారం తీయడానికే సరిపోయింది. చేతిలో ఇప్పుడు చిల్లి గవ్వ లేదు. ఏం చేయాలో అర్థం కావడం లేదు. మంచిర్యాల జిల్లా వ్యాప్తంగా 20 వేల ఎకరాలకు అక్రమంగా జారీ చేసిన పట్టాల వివరాలు నా దగ్గర ఉన్నాయి. సీఎంను కలిసే అవకాశం ఇస్తే అన్నీ వారికి అందజేస్తా. ఈ విషయం ఇప్పటికే బెల్లంపల్లి ఎమ్మెల్యే వినోద్ దృష్టికి తీసుకెళ్లాను. ఆయన పట్టించుకోవడం లేదు. ఏం చేయాలో పాలుపోని పరిస్థితుల్లో ‘నమస్తే తెలంగాణ’ను సంప్రదించా. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించాలని కోరుకుంటున్నా.
– ఇందుర్తి రాంమోహన్రావు, సామాజిక కార్యకర్త