కుమ్రం భీం ఆసిఫాబాద్, జూలై 4 (నమస్తే తెలంగాణ) : జిల్లాలోని సర్కారు బడులతో పాటు ఆశ్రమాలు, రెసిడెన్సియల్స్, వసతిగృహాలు సమస్యలతో సతమతమవుతున్నాయి. ఊడిన తలుపులు, కిటికీలు.. వేలాడుతున్న విద్యుత్ వైర్లు.. పై కప్పులేని బావులు, కూలిన ప్రహరీలు, తెరచి ఉన్న నీటి సంపులు, పిచ్చిమొక్కలతో చిత్తడిగా మారిన ఆవరణలు.. ఇలా ఒకటేమిటి అనేక సమస్యలతో ప్రమాదకర పరిస్థితులు నెలకొన్నాయి. వానకాలం కావడంతో పాములు, తేళ్లతో పాటు విషపురుగులు సంచరించే అవకాశముండగా, విద్యార్థులు, ఉపాధ్యాయులు భయంభయంగా గడపాల్సిన దుస్థితి దాపురించింది.
జిల్లాలో గిరిజన సంక్షేమ ఆశ్రమాలతో పాటు బీసీ, ఎస్సీ రెసిడెన్సియల్ పాఠశాలలు, వసతి గృహాలు దాదాపు 80 వరకు ఉండగా, దాదాపు 18 వేల మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. విద్యాసంస్థల ప్రారంభానికి ముందే సౌకర్యాలపై దృష్టి సారించాల్సిన అధికారులు, ఆ వైపు కన్నెత్తి చూడకపోవడం వల్ల ఇలాంటి పరిస్థితులు తలెత్తాయన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ప్రధానంగా ఆశ్రమాలు, రెసిడెన్సియల్స్, వసతిగృహాల్లో డార్మెట్రీలు.. మొదలుకొని టాయిలెట్స్, స్నానాల గదులు, వంటశాలలు, చివరికి తరగతి గదుల్లో కూడా విద్యార్థులకు భద్రత కొరవడుతున్నది. రాత్రింబవళ్లూ భయాందోళనల నడుమ చదువులు సాగించాల్సి వస్తున్నదని పలువురు విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఇటీవల సిర్పూర్(టీ) మండలం అచ్చంపల్లి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ఆవరణలోని నీటి సంపు వద్ద మూడో తరగతి విద్యార్థిని దర్శితను పాము కాటు వేయగా, స్థానికుల సకాలంలో స్పందించడం వల్ల ప్రాణాపాయం తప్పింది. గతంలోనూ ఇలాంటి ఘటనలు అనేకం ఉన్నాయి. కాగా, ప్రస్తుతం విద్యాలయాలు అధ్వానంగా మారాయనడానికి ‘నమస్తే తెలంగాణ’ తీసిన ఈ చిత్రాలే నిదర్శనంగా నిలుస్తున్నాయి. ఈ విషయమై జిల్లా గిరిజన సంక్షేమ శాఖ అధికారి రమాదేవిని వివరణ కోరేందుకు యత్నించగా, అందుబాటులోకి రాలేదు.