నిర్మల్, జూన్ 29(నమస్తే తెలంగాణ) : పల్లె పాలన పడకేసింది. గ్రామ పంచాయతీల ఖాతాలు ఖాళీ అయ్యాయి. కనీసం గ్రామాల్లో వీధి దీపాలు, తాగునీటికి సంబంధించిన బోర్లు, పైపులైన్లకు మరమ్మతులు చేసే పరిస్థితి లేదు. పంచాయతీ కార్యదర్శులకు పారిశుధ్య నిర్వహణ పెద్ద తలనొప్పిగా మారింది. కనీసం పారిశుధ్య కార్మికులకు జీతాలిచ్చే పరిస్థితి లేకుండా పోయింది. మురికి కాలువలను శుభ్రం చేయడం, చెత్తను తొలగించడం సవాల్గా మారింది. కరెంటు బిల్లులు భారంగా మారాయి. చేసేదేమి లేక స్పెషలాఫీసర్లు చేతులెత్తేశారు.
చాలా చోట్ల పంచాయతీ కార్యదర్శులే అప్పులు చేసి కనీస అవసరాలు తీర్చేందుకు నానా తంటాలు పడుతున్నారు. పెద్ద పంచాయతీల్లో కొంతవరకు బాగానే ఉన్నా, వెయ్యి లోపు జనాభా ఉన్న పంచాయతీల పరిస్థితి అధ్వానంగా తయారైంది. అసలే వానకాలం కావడంతో పారిశుధ్య నిర్వహణ పంచాయతీ కార్యదర్శులకు తలకుమించిన భారంగా మారుతున్నది. జిల్లాలోని పంచాయతీల నిర్వహణకు ప్రతి నెల రూ.5.50 కోట్లు అవసరమవుతాయని అధికారులు చెబుతున్నారు.
కొత్తగా అధికారం చేపట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం పంచాయతీలకు నయా పైసా మంజూరు చేయకపోవడంతో పల్లెపాలన పూర్తిగా గాడి తప్పుతున్నది. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో గ్రామాలు, తండాల అభివృద్ధికి పల్లె ప్రగతి ద్వారా కోట్లాది రూపాయలను వెచ్చించడంతో పల్లెల రూపురేఖలు మారిపోయాయి. ఎటు చూసినా అద్దాల్లా మెరిసే రోడ్లు, రోడ్లకు ఇరువైపులా పచ్చని చెట్లు, డ్రెయినేజీ వ్యవస్థను ఏర్పాటు చేయడంతో గ్రామాలు పరిశుభ్రమైన వాతావరణంతో కనువిందు చేసేవి. కానీ.. ప్రస్తుత ప్రభుత్వంలో పంచాయతీలు నిధుల లేమితో కొట్టుమిట్టాడుతున్నాయి.
నిర్మల్ జిల్లాలో 396 గ్రామ పంచాయతీలు ఉండగా, ఇందులో వెయ్యి లోపు జనాభా ఉన్న పంచాయతీలు 195 ఉన్నాయి. కాగా, ఈ ఏడాది జనవరి 31వ తేదీతో సర్పంచ్ల పదవీ కాలం ముగిసింది. ఫిబ్రవరి 1 నుంచి స్పెషల్ ఆఫీసర్ల పాలన మొదలైంది. జిల్లాలో మొత్తం 178 మంది ప్రత్యేక అధికారులను నియమించారు. పంచాయతీలకు 15వ ఆర్థిక సంఘం, స్టేట్ ఫైనాన్స్ నుంచి వచ్చే నిధులు ముఖ్యమైన ఆర్థిక ఆధారాలు. కాగా, కొంత కాలం నుంచి ఎస్ఎఫ్సీ నిధులు రావడం లేదు. ఇక జనాభాకు అనుగుణంగా ఒక్కొక్కరికీ రూ.812 చొప్పున 15వ ఆర్థిక సంఘం నిధులను మంజూరు చేస్తున్నది.
ప్రత్యేక అధికారులు వచ్చినప్పటి నుంచి అవి కూడా రావడం లేదు. అలాగే పెద్ద పంచాయతీల్లో ఇంటి పన్నులు, తైబజార్, గృహ నిర్మాణ ఫీజులు, వ్యాపార, వాణిజ్య లైసెన్సు ఫీజుల రూపేనా కొంత ఆదాయం సమకూరుతున్నది. కానీ, చిన్న పంచాయతీలకు ప్రభుత్వం ఇచ్చే గ్రాంట్లు తప్ప ఇతర ఆధారాలు లేవు. చాలా గ్రామాల్లో ఇంటి పన్నులు కట్టేందుకు కూడా ప్రజలు ముందుకు రావడం లేదు. ముఖ్యంగా ట్రాక్టర్ ఈఎంఐ, డీజిల్, తాగునీటి పైప్లైన్లు, బోర్ల మరమ్మతులు, కరెంటు బిల్లులు, విద్యుత్ బల్బులు, డంప్యార్డు నిర్వహణ, పారిశుధ్య కార్మికుల జీతాలు, పారిశుధ్య నిర్వహణ, తాగునీటి సరఫరా వంటి కార్యక్రమాలను చేపట్టాల్సి ఉంటుంది. అయితే వీటికి వనరులు లేక నానా అవస్థలు పడుతున్నారు.
జిల్లాలోని పంచాయతీల్లో దాదాపు 1,600 మంది పారిశుధ్య కార్మికులు పని చేస్తున్నారు. వీరిలో చాలా మందికి మూడు, నాలుగు నెలల నుంచి జీతాలు రావడం లేదు. ఈ క్రమంలో ప్రత్యేక అధికారులు కనీసం పంచాయతీల వైపు దృష్టి సారించడం లేదన్న విమర్శలున్నాయి. గతంలో చెత్త ఏరివేత కోసం ట్రాక్టర్లు, ఆటోలు కొనుగోలు చేశారు. ఇవి సంబంధిత పంచాయతీ కార్యదర్శుల పేరిట రిజిస్ట్రేషన్ అయ్యాయి. ఈఎంఐ కట్టకపోతే వారి సొంత ఖాతాలకు చెందిన సివిల్ స్కోరు పడిపోతుందని వాపోతున్నారు. దీంతో వారి అవసరాలకు బ్యాంకు నుంచి అప్పు పుట్టని పరిస్థితి నెలకొన్నదని చెబుతున్నారు.
జిల్లాలోని చిన్న పంచాయతీలకు నిధుల కొరత తీవ్రంగా ఉంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి రావాల్సిన నిధులు సకాలంలో రావడం లేదు. ఈ విషయాన్ని ఇప్పటికే రాష్ట్ర కమిషనర్ దృష్టికి తీసుకెళ్లాం. త్వరలోనే నిధులు మంజూరు చేస్తామని చెప్పారు. పెద్ద పంచాయతీల్లో ఇంటి పన్నులు వసూలు చేయడంతో కొంతవరకు ఇబ్బందిని అధిగమించగలిగాం.
రాబోయే 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఇంటి పన్నులను కూడా జూలై నెలలో వసూలు చేయాలని ఆదేశాలు వచ్చాయి. ఈ పన్నులు వసూలైతే మరో రెండు, మూడు నెలల వరకు పంచాయతీల నిర్వహణకు ఇబ్బంది ఉండదు. జిల్లాలో 25 శాతానికి పైగా పంచాయతీల్లో పని చేస్తున్న పారిశుధ్య కార్మికులకు సంబంధించిన జీతాలు మూడు నెలలుగా పెండింగ్లో ఉన్నాయి. ఈ విషయాన్ని కూడా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాం. త్వరలోనే నిధులు మంజూరు చేస్తామని చెప్పారు.
– శ్రీనివాస్, జిల్లా పంచాయతీ అధికారి, నిర్మల్.