మంచిర్యాలటౌన్, జూన్ 26: మంచిర్యాలలో ఇసుక మాఫి యా విజృంభిస్తున్నది. రాత్రికిరాత్రే గోదావరి నుంచి పెద్ద ఎత్తున ఇసుకను అక్రమంగా తరలించి వారికి అనుకూలమైన ప్రాంతాల్లో నిల్వ చేసుకుంటున్నారు. 3 రోజుల వ్యవధిలోనే వందలాది ట్రాక్టర్ల ఇసుక మంచిర్యాల పట్టణం పాతమంచిర్యాల శివారు ప్రాంతాల్లోకి తీసుకువచ్చారు. వర్షాలు కురిస్తే గోదావరిలో నీటి ప్రవాహం పెరిగి ఇసుక దొరకదని భావించి న స్మగ్లర్లు ముందుగానే ఇక్కడికి తరలించారు.
వర్షాకాలంలో భవన నిర్మాణ అవసరాలు, ఇతర అవసరాలకు ఇసుక ఉండే డిమాండ్ను ముందే పసిగట్టిన ఇసుక మాఫియా పాతమంచిర్యాల సమీపంలోని గోదావరి నుంచి రాత్రి, పగలు తేడా లే కుండా వందలాది ట్రిప్పుల ఇసుకను శివారులోని ఖాళీ ప్రదేశాల్లో నిల్వ చేశారు. ఎలాంటి అనుమతి లేకుండా గోదావరి నుంచి తీసుకువచ్చిన ఇసుకను వర్షాకాలంలో ఒక్కో ట్రిప్పునకు రూ.3 వేలకు పైగా అధిక ధరకు అమ్ముకుని సొమ్ముచేసుకోవాలన్న ఆలోచనతో ఉన్నారు. పాతమంచిర్యాలలో గోదావరి రోడ్లో దాదాపుగా 20 నుంచి 25 ప్రాంతాల్లో పెద్ద ఎ త్తున ఇసుక డంప్లు ఏర్పాటు చేసుకున్నారు.
పట్టణంతో పా టు ఇతర ప్రాంతాలకు ఇసుకను సరఫరా చేస్తారు. ఇంతపెద్ద ఎత్తున ఇసుక దోపిడీ జరుగుతున్నా సంబంధిత శాఖల అధికారులు మాత్రం తమకేమీ తెలియదన్నట్లు వ్యవహరించడం పై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇసుక ట్రాక్టర్ల యజమానులకు వారు కొమ్ముకాస్తున్నారన్న విమర్శలు వెల్లువెల్లువెత్తుతున్నాయి. ఈ దందా వెనుక పెద్దల హస్తం ఉన్నట్లు ప్రచారం జరుగుతున్నది. ఉన్నతాధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని పట్టణ వాసులు కోరుతున్నారు. ఈ విషయంపై జిల్లా మైనింగ్ ఏడీ జగన్మోహన్రెడ్డిని వివరణ కోరేందుకు సంప్రదించగా ఆయన అందుబాటులో లేరు.