నల్లగొండ, జూన్ 30 : తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తర్వాత అధికారం చేపట్టిన గత బీఆర్ఎస్ ప్రభుత్వం రైతు సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని పంట పెట్టుబడి సాయం కోసం రైతు బంధు పథకాన్ని ప్రవేశపెట్టి 11 దఫాలుగా అందజేయగా.. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం కొర్రీలు పెడుతూ అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నది. రైతు బంధు పథకాన్ని రైతు భరోసాగా మార్చిన రేవంత్ సర్కారు అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటి విడుతలోనే ఎన్నో ఆపసోపాల మధ్య ఇచ్చించి.
ప్రస్తుత వానకాలం రెండో విడుతలో పంపిణీ చేయాల్సి ఉండగా పలు మార్పులకు శ్రీకారం చుట్టింది. ఐదెకరాల్లోపు ఉన్న రైతులకే పెట్టుబడి సాయం అవసరమని, మిగతా వారికి అవసరం లేదని నిర్ణయించి.. ఈ విషయం తాము కాదు రైతులే అంటున్నారని అబద్ధపు మాటలను ప్రజల ముందు ఉంచాలనే కుట్రతో రైతుల నుంచి అభిప్రాయ సేకరణ చేపడుతున్నది.
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఆయా ప్రాథమిక సహకార సంఘాల్లో సహకార, వ్యవసాయ శాఖ అధికారులతో సర్వసభ్య సమావేశాలు నిర్వహించి ఐదెకరాలపైనున్న వారికి రైతుభరోసా ఇవ్వద్దని రైతులే అంటున్నారనే కుట్రలకు తెరతీసింది. జూన్ 29 నుంచి జూలై 4వరకు ఈ అభిప్రాయ సేకరణ పూర్తి చేసి ఐదెకరాలలోపు ఉన్న రైతులకే పెట్టుబడి సాయం ఇచ్చే విధంగా సర్కారు ప్రణాళికలు రూపొందించినట్లు తెలుస్తున్నది. ఎన్నికల హామీల్లో ఇచ్చిన దానికి అనుగుణంగా ఏడాదికి ఎకరాకు రూ.15వేలు ఇవ్వాల్సిన నేపథ్యంలో పెట్టుబడి సాయం గణనీయంగా పెరుగుతుందని ఆలోచించిన ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
పంట పెట్టుబడి సాయం వల్ల ప్రభుత్వంపై ఎక్కువ భారం పడకుండా తీసుకుంటున్న చర్యల్లో భాగంగానే రైతుల నుంచి అభిప్రాయ సేకరణ చేపడుతున్నారనే విమర్శలు క్షేత్రస్థాయిలో రైతుల నుంచి వస్తున్నాయి. బీఆర్ఎస్ ప్రభుత్వం 2018 వానకాలం నుంచి 2023 వానకాలం సీజన్ వరకు 11 దఫాలుగా రైతుబంధు అందజేసింది. తొలుత సీజన్కు ఎకరాకు రూ.4వేలు ఇచ్చిన కేసీఆర్ సర్కార్ ఆ తర్వాత రూ.5వేల చొప్పున ఇచ్చింది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత గత యాసంగి సీజన్కు సాయం విడుదల చేసింది. అది కూడా పలు విడుతల్లో రైతుల ఖాతాల్లో జమచేయడంతో రైతులు ఇబ్బందులు పడ్డారు. ప్రస్తుతం ఈ వానకాలం సీజన్ సాయం ఇవ్వకుండా ఆపి అభిప్రాయ సేకరణ చేపట్టింది. ఈ అభిప్రాయ సేకరణ తర్వాత వానకాలం పెట్టుబడి సాయం ఐదెకరాలలోపు ఉన్న రైతులకే ఇచ్చే అవకాశం ఉంది.
రైతు బందు పథకాన్ని రైతు భరోసాగా మార్చిన కాంగ్రెస్ సర్కారు ఈ పథకం కింద ఐదెకరాలలోపు ఉన్న రైతులకే పెట్టుబడి సాయం ఇవ్వాలని కుట్రలు చేస్తున్నది. ఈ విషయాన్ని ప్రభుత్వమే నేరుగా చెపితే వ్యతిరేకత మూటగట్టుకుంటామనే ఆలోచనతో రైతులే ఐదెకరాల లోపు ఉన్న వారికి ఇవ్వాలని అంటున్నారని నమ్మబలకడానికి రైతుల నుంచి అభిప్రాయ సేకరణ చేపడుతున్నట్లు తెలుస్తున్నది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్న 107 ప్రాథమిక సహకార సంఘాల్లో రైతుల నుంచి అభిప్రాయాలు సేకరిస్తున్నారు. జిల్లా సహకార శాఖ, జిల్లా వ్యవసాయ శాఖ సంయుక్తంగా నిర్వహిస్తున్న రైతుల అభిప్రాయ సేకరణలో జిల్లా సహకార అధికారి, ఆడిట్ అధికారి, వ్యవసాయ అధికారుల సమక్షంలో జరుగుతున్నాయి. ప్రతిరోజూ ఈ ముగ్గురు అధికారులు ఆయా జిల్లాలో మూడు చొప్పున మొత్తం మూడు జిల్లాల్లో 27 సమావేశాల చొప్పున ఈ నెల 4వరకు 107 ప్రాథమిక సహకార సంఘాల్లో అభిప్రాయ సేకరణ చేసి ప్రభుత్వానికి నివేదిక అందజేయనున్నారు. ఆయా సమావేశాల్లో రైతులతో మాట్లాడిస్తున్నప్పటికీ పెద్ద రైతుల అభిప్రాయాలు పరిగణనలోకి తీసుకోకుండానే ఐదెకరాలలోపే పెట్టుబడి సాయం కావాలని రైతులు అంటున్నారని అధికారులు ప్రభుత్వానికి నివేదిస్తుంటడం గమనార్హం.
ప్రభుత్వం రైతు భరోసాపై రైతుల నుంచి అభిప్రాయాలు సేకరించి మినిట్స్ రూపంలో రికార్డ్ చేసి నివేదిక ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది. దాంతో జిల్లాలో ఉన్న ప్రాథమిక సహకార సంఘాల్లో సర్వ సభ్య సమావేశాలు ఏర్పాటు చేసి రైతుల నుంచి అభిప్రాయాలు సేకరిస్తున్నాం. ఆయా సంఘాల్లో సభ్యులు ఉన్న రైతులకు ముందే సమాచారం అందజేసి వారి నిర్ణయాలు తీసుకుంటున్నాం. రైతులు మాత్రం ఐదెకరాల లోపు ఉన్న వారికి రైతు భరోసా ఇవ్వాలని అంటున్నారు.
– పాల్వాయి శ్రవణ్ కుమార్, వ్యవసాయ అధికారి, నల్లగొండ
గత ప్రభుత్వంలో అప్పటి సీఎం కేసీఆర్ ఇచ్చిన మాదిరిగానే రైతుబంధు ఇవ్వాలి. కాంగ్రెస్ ప్రభుత్వం సకాలంలో రైతుబంధు ఇవ్వడం లేదు. గత యాసంగిలో ఆలస్యంగా వేశారు. ప్రస్తుతం వానకాలం మొదలైనా ఇప్పటి వరకూ ఇవ్వలేదు. దాంతో అప్పులు తెచ్చి పంటలు సాగు చేయాల్సి వస్తున్నది. కాంగ్రెస్ ప్రభుత్వం రైతు భరోసా పేరుతో ఎకరాకు 7,500 రూపాయలు ఇస్తామని హామీ ఇచ్చి మరిచిపోయింది. కాంగ్రెసోళ్లు పంట వేసిన భూమికే పెట్టుబడి సాయం ఇస్తామంటే ఎట్లా. బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చినట్లుగానే రైతుబంధు అందజేయాలి. కాంగ్రెస్ ఎన్నికల హామీలను అమలు చేయాలి.
– శేఖర్రెడ్డి, రైతు, చిన్నసూరారం, నల్లగొండ మండలం
ఎన్నికల ముందు అందరికీ రైతు బంధు ఇస్తామని చెప్పిన కాంగ్రెస్ అధికారంలో చేపట్టిన తర్వాత కొర్రీలు పెడుతున్నది. ఐదు ఎకరాలు, పది ఎకరాల వరకే ఇస్తామని చెప్పడం మోసం చేసినట్లే. గత ప్రభుత్వం ఎకరానికి 5 వేలు సకాలంలో రాగా కాంగ్రెస్ 7.500 వేల రూపాయలు ఇస్తామని చెప్పి కాలయాపన చేస్తున్నది. దాంతో రైతులు అప్పులు తెచ్చి వ్యవసాయం చేయాల్సి వస్తున్నది. గత ప్రభుత్వం మాదిరిగా ప్రతి ఎకరాకూ రైతు బంధు ఇవ్వాలి.
– అలుగుబెల్లి సుధాకర్రెడ్డి, మంచినీళ్లబాయి, కనగల్ మండలం(నల్లగొండ సిటీ)