నిర్మల్ అర్బన్, జూన్ 30 : ప్రజారోగ్యానికి హాని కలిగించే నిషేధిత గుట్కాపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. గుట్కా వ్యాపారం, అమ్మకాలను పూర్తిగా నియంత్రించేందుకు పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. ఎస్పీ జానకి షర్మిల ఆదేశాల మేరకు నిఘాను పటిష్ట పర్చారు. ఇందులో భాగంగా తాజాగా నిర్మల్ జిల్లా కేంద్రంలోని అన్ని వ్యాపార దుకాణ, గోదాముల్లో దాడు లు జరిపించారు. పెద్ద ఎత్తున నిషేధిత గుట్కాను పట్టుకున్నారు. దీంతోపాటు నిర్మల్ జిల్లాకు అంతర్రాష్ట్ర(మహారాష్ట్ర) సరిహద్దు ప్రాంతాలైన తానూర్(బేల్తరోడ), సారంగాపూర్ (రాంసింగ్ తండా) వద్ద గల అంతర్రాష్ట్ర చెక్పోస్టు వద్ద పోలీసులు నిఘాను పటిష్టం చేశారు. ఇతర రాష్ర్టాలలో గుట్కాపై నిషేధం లేకపోవడంతో ఇక్కడి ప్రాంతాల్లో నిషేధం ఉండడంతో కొందరు వ్యాపారులు అక్రమార్జనకు తెరలేపారు. తక్కువ సమయంలో ఎక్కువ ఆదాయం అర్జించాలనే అత్యాశతో వ్యాపారంలోకి దిగుతున్నారు. పోలీసులు నిఘాను పటిష్టం చేయడంతో పట్టుబడుతున్నారు.
ఇతర రాష్ర్టాల నుంచి మన రాష్ట్రం(నిర్మల్ జిల్లాలకు) వచ్చే వాహన రాకపోకలపై దృష్టి సారించారు. వాహన నంబర్లను రికార్డు చేస్తూ క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. ఎక్కడి నుంచి వాహనం వస్తున్నది? ఎక్కడికి వెళ్తున్నది? వాహనంలోని సరుకుల వివరాలను పోలీసులు నమోదు చేస్తున్నారు. పట్టుబడిన వాహనాలను ఉన్నతాధికారులకు అప్పగిస్తున్నారు. అంతేకాకుండా శివారు ప్రాంతాల్లో అద్దెకు తీసుకుని నిల్వ ఉంచుతున్న గోదాములపై కూడా దృష్టి సారించారు.
నిర్మల్ జిల్లాలో నిషేధిత గుట్కా అమ్మకాలపై ఉక్కుపాదం మోపుతున్నాం. ఇప్పటికే నిర్మల్, భైంసా ప్రాంతాల్లో దాడులు నిర్వహించాం. దాదాపు రూ.12 లక్షల విలువ చేసే గుట్కాను స్వాధీనం చేసుకుని పలువురిపై కేసులు నమోదు చేశాం. గుట్కాను అడ్డకునేందుకు అంతర్రాష్ట్ర చెక్పోస్టుల వద్ద నిఘాను పటిష్టం చేశాం. తనిఖీలను విస్తృతం చేస్తున్నాం. నిషేధిత గుట్కా, పాన్మసాలాను ఎవరైనా విక్రయించినా, కొనుగోలు చేసినా కఠిన చర్యలు తప్పవు. పూర్తిస్థాయిలో అడ్డుకట్ట వేసే దిశగా చర్యలు చేపడుతున్నాం. ఎవరైనా గుట్కాను విక్రయించినా, సరఫరా చేసినట్లయితే పోలీసులకు సమాచారం అందించండి. సమాచారం అందించిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతాం. – నిర్మల్ ఎస్పీ జానకి షర్మిల