బెల్లంపల్లి, ఆగస్టు 22 : పట్టణంలో బహుళ అంతస్తుల నిర్మాణాలు చేపడితే తప్పనిసరిగా అనుమతులు తీసుకోవాలని కలెక్టర్ కుమార్ దీపక్ పేర్కొన్నారు. గురువారం బెల్లంపల్లిలో ఆయన పర్యటించారు. ఇక్కడ జీప్లస్ 2 భవనాలకు మాత్రమే అనుమతి ఉందని, జీప్లస్ 3 భవనాలకు వరంగల్ ఆర్డీ నుంచి అనుమతులు తీసుకోవాలన్నారు. బహుళ అంతస్తులకు అనుమతి తీసుకోని వారికి షోకాజ్ నోటీసులు ఇవ్వాలని, నిబంధనల ప్రకారం వారిపై చర్యలు తీసుకోవాలని మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ను ఆదేశించారు.
అనంతరం మహాత్మా జ్యోతిబాఫూలే వసతి గృహాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. మెనూ ప్రకారం భోజనం పెడుతున్నారా అని విద్యార్థులను అని అడిగి తెలుసుకున్నారు. 29వ వార్డులో డ్రైనేజీ వ్యవస్థను పరిశీలించారు. మాజీ కౌన్సిలర్ రాజులాల్ యాదవ్ ఇబ్బందులను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. మురుగు కాలువలపై నిర్మించిన ఇళ్లను తొలగిస్తేనే సమస్య పరిష్కారమవుతుందని కలెక్టర్ తెలిపారు. బజార్ ఏరియాలోని జడ్పీ పాఠశాలలో మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. భోజనం సరిగా ఉండడం లేదని కలెక్టర్ దృష్టికి రాగా హెచ్ఎంను ప్రశ్నించారు. ఈ రోజు మాత్రమే కూరలు రుచిగా లేకపోవడంతో పిల్లలు పెరుగుతో తిన్నారని తెలిపారు. ప్రతి రోజూ నాణ్యమైన భోజనాన్ని అందించాలని సూచించారు. 31వ వార్డులో ఏర్పాటు చేసిన వైద్య శిబిరాన్ని ఆయన సందర్శించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ జక్కుల శ్వేత, మున్సిపల్ అధికారులు ఉన్నారు.