భైంసా, జూన్ 29 : భైంసా పట్టణంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో పల్లవి(14) అనే బాలిక శనివారం మృతి చెందింది. వైద్యుడి నిర్లక్ష్యం కారణంగానే చనిపోయిందని బంధువులు ఆసుపత్రి ఎదుట గల రోడ్డుపై ధర్నా నిర్వహించారు. బాధితులు తెలిపిన కథనం ప్రకారం.. కుభీర్ మండల కేంద్రానికి చెందిన శంకర్-విజయల కూతురు పల్లవి కడుపునొప్పితో బాధపడుతుండగా శుక్రవారం భైంసాలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తీసుకొచ్చారు. పరీక్షించిన వైద్యుడు అపెండిక్స్ ఉందని ఆపరేషన్ చేసి తొలిగించాలని సూచించినట్లు పేర్కొన్నాడు.
దీంతో సాయంత్రం 6 గంటలకు ఆపరేషన్ థియేటర్లోకి తీసుకెళ్లగా దాదాపు మూడు గంటలపాటు ఆపరేషన్ చేసినట్లు పేర్కొన్నారు. శనివారం ఉదయం బాలిక పరిస్థితి విషమించి మృతి చెందింది. దీంతో ఈ విషయమై వైద్యుడిని అడిగితే చిన్న పేగుకు చీము వచ్చిందని బీపీ తగ్గిపోయి సెప్టిక్ షాక్తో మృతి చెందిందని చెప్పినట్లు కుటుంబీకులు తెలిపారు. వైద్యుడి వివరణతో సంతృప్తి చెందని బాలిక బంధవులు ఆందోళనకు దిగారు.
ఈ విషయం తెలుసుకున్న పట్టణ సీఐ రాజారెడ్డి అక్కడికి చేరుకుని బాధితులతో మాట్లాడారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని స్థానిక ఏరియా ఆసుపత్రికి తరలిస్తామని చెప్పగా బాలిక బంధువులు ససేమిరా అన్నారు. స్థానిక వైద్యులపై తమకు నమ్మకం లేదని నిర్మల్కు తరలించాలని చెప్పడంతో వెంటనే నిర్మల్ ఆసుపత్రికి తరలించగా ఆందోళన విరమించారు. బాలిక తండ్రి శంకర్ ఫిర్యాదు మేరకు వైద్యుడిపై కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు.