నిర్మల్, జూన్ 30(నమస్తే తెలంగాణ) : రైతుబంధు డబ్బుల కోసం రైతులు ఎదురు చూస్తున్నారు. కేసీఆర్ ప్రభుత్వం పదేళ్లుగా యేటా రెండు పంటలకు ఎకరానికి రూ.10 వేల చొప్పున పెట్టుబడి సహాయాన్ని అందించింది. ఎన్నికల హామీలో భాగంగా రెండు సీజన్లకు ఎకరాకు రూ.15 వేలు అందిస్తామని గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం ఆ హామీని బుట్టదాఖలు చేసింది.
గత యాసంగిలో కొంత మందికే సాయాన్ని అందించిన కాంగ్రెస్ ప్రభుత్వం.. వానకాలం సీజన్కు సంబంధించిన పెట్టుబడి సాయాన్ని అందించేందుకు అనేక ఆంక్షలు అమలు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నది. రైతుల నుంచి అభిప్రాయ సేకరణ పేరిట అమలును జాప్యం చేసేందుకు యత్నిస్తున్నదన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
జిల్లాలో 1.83 లక్షల మంది రైతులు ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. ఇందులో కాంగ్రెస్ ప్రభుత్వం ఎంతమంది రైతులకు రైతుబంధు ఇస్తుందో అన్న విషయంపై స్పష్టత లేదు. వానకాలంలో రైతులు అప్పులు చేసి సాగుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే 80 శాతానికి పైగా సోయా, పత్తి, మక్క, పప్పు దినుసుల పంటలు పూర్తయినట్లు అధికారులు చెబుతున్నారు. గత వారం రోజులుగా వర్షాలు సమృద్ధిగా కురుస్తున్న నేపథ్యంలో మరో వారం రోజుల్లో బోరుబావుల కింద వరి నాట్లను ప్రారంభించేందుకు రైతులు సిద్ధమవుతున్నారు.
రైతుబంధుపై రాష్ట్ర ప్రభుత్వానికి ముందుచూపు లేదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పెట్టుబడి సహాయాన్ని మే నెలాఖరులో లేదా జూన్ మొదటి వారంలో అందిస్తే విత్తనా లు, ఎరువులు, ఇతర ఖర్చులకు ఉపయోగపడేవని రైతులు చెబుతున్నారు. అప్పులు చేసి సాగు చేసిన తర్వాత సహాయా న్ని అందించినా ప్రయోజనం ఏమిటన్న ప్రశ్నలు వినిపిస్తున్నా యి. ముందస్తుగా పెట్టుబడి సహాయాన్ని అందిస్తే సాగు సకాలంలో పూర్తయి దిగుబడులు కూడా పెరిగే అవకాశం ఉందంటున్నారు. సమయానికి చేతిలో చిల్లిగవ్వ లేక చిన్న, సన్నకారు రైతులు పంటల సాగును ఆలస్యం చేయడంతో చివరి దశలో చీడపీడలు ఆశించి తీవ్రంగా నష్టపోతున్నారు.
మరోవైపు బ్యాంకులో తీసుకున్న రుణాలు మాఫీ కాకపోవడం, కొత్త రు ణాలు ఆలస్యం కావడంతో పెట్టుబడి కోసం రైతులు దిక్కులు చూడాల్సిన పరిస్థితులు ఎదురవుతున్నాయి. కాగా.. కొందరు రైతులు బంగారు నగలను కుదువ పెట్టి పెట్టుబడి సహాయాన్ని సమకూర్చుకుంటున్నారు. ఇదిలా ఉంటే కొంతమంది దళారులు రైతుల అవసరాన్ని ఆసరా చేసుకుంటూ అధిక వడ్డీలకు అప్పులిస్తూ అందినకాడికి దండుకుంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. చేసిన కష్టమంతా దళారులపాలవుతున్నదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా వెంటనే రైతుబంధు సాయాన్ని అందజేసి రైతులను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని రైతులు డిమాండ్ చేస్తున్నారు.
నాకు తానూర్ శివారులో ఏడెకరాల వ్యవసాయ భూమి ఉన్నది. ఐదెకరాల్లో పత్తి, రెండెకరాల్లో సోయా వేసిన. ఈ నెల మొదటి వారంలో వర్షాలు పడగానే పత్తి వేసిన. 15 రోజుల కింద సోయా అలికిన. ఇప్పటికైతే పంటలు మంచిగనే ఉన్నయి. రైతుబంధు రాకపోవడంతో అప్పులు తెచ్చి పంటలు వేసిన. ట్రాక్టర్తో దుక్కులు, ఎరువులు, విత్తనాలు, కూలీల కోసం తెలిసిన కాడ రూ.50 వేలు బాకీ చేసిన. సకాలంలో రైతుబంధు ఇవ్వకుండా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను మోసం చేస్తున్నది.
– పంగి గంగారెడ్డి, రైతు, తానూర్.
కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఆరు నెలలు దాటినా రైతులకు ఒక్క మంచి పని చేయలేదు. గత యాసంగిలో రైతుబంధు కొందరికే ఇచ్చిన్రు. వాన కాలం రైతుబంధు ఇంకా రాలేదు. ఎప్పుడు వస్తదో తెల్వదు. ఆరు ఎకరాల్లో మక్కపంట వేసిన. ఖర్చులు తడిసిమోపెడైనయ్. కేసీఆర్ పాలనలో టైంకు రైతుబంధు అందుతుండే. రైతుల కష్టం తెలిసిన కేసీఆరే రైతులకు అన్నీ బాగా చేసిండు. ప్రతి ఒక్క రైతుకు రైతుబంధు ఇచ్చిండు. ఎరువులు, విత్తనాల కోసం తిప్పలు లేకుండే. రైతులకు కేసీఆర్ పాలనే బాగుండే. – ఆలూరి శ్రీనివాస్రెడ్డి, రైతు, సిద్దులకుంట.