ఎదులాపురం, జూన్ 29 : మంచిర్యాల జిల్లాలోని శ్రావణపల్లి బొగ్గుబ్లాకుల వేలాన్ని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఆపాలని, నేరుగా సింగరేణి కంపెనీకి అప్పగించాలని సీపీఎం పార్టీ జిల్లా కార్యదర్శి దర్శనాల మల్లేశ్ డిమాండ్ చేశారు. శనివారం కలెక్టరేట్ ఎదుట బొగ్గుగనుల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా నిరసన తెలిపారు. ఈ సందర్భంగా మల్లేశ్ మా ట్లాడుతూ.. గతంలోనే మోదీ ప్రభుత్వం నాలుగు బ్లాకులను ప్రైవేట్ సంస్థలకు అప్పగించిందని మండిపడ్డారు.
బొగ్గు గనుల శాఖ మంత్రిగా ఉన్న కిషన్రెడ్డి హైదరాబాద్ కేంద్రంగానే వేలం పాట ప్రక్రియను ప్రారంభించడం అన్యాయం అన్నారు. బొగ్గు బ్లాకులన్నీ ప్రైవేట్ సంస్థలకు ఇచ్చిన తర్వాత సింగరేణికి మిగిలేదేముందన్నారు. క్రమంగా సింగరేణి సంస్థ బలహీనబడి మూతపడే వైపు మోదీ ప్రభుత్వం నెట్టుతున్నదన్నారు. ఈ ప్రయత్నాలను తెలంగాణ ప్రజలు అడ్డుకోవాలని సీపీఎం పార్టీ కోరుతుందన్నారు. తెలంగాణకు మణిహారంగా ఉన్న సింగరేణిని కాపాడుకునేందుకు రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు కదలాలని కోరారు.
పదేండ్లలో మోదీ ప్రభుత్వం సుమారు 200 బొగ్గు బావులను ప్రైవేటు సంస్థలకు కట్టబెట్టిందన్నారు. రాష్ట్రంలో ఎనిమిది మంది ఎంపీలు, ఎనిమిది మంది ఎమ్మెల్యేలు ఉన్న తెలంగాణకు ఇంత అన్యాయం జరుగుతుంటే నోరు మెదపడం లేదన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ సీనియర్ నాయకుడు బండి దత్తాత్రి, కార్యదర్శి వర్గ సభ్యులు లంక రాఘవులు, కిరణ్, సచిన్, నాయకులు మంజుల, స్వామి, ఆశన్న, పొచక్క, తదితరులు ఉన్నారు.