ఆదిలాబాద్, జూన్ 29(నమస్తే తెలంగాణ) : వానకాలం ప్రారంభమై నెల రోజులు అవుతున్నది. మత్స్యకారుల ఉపాధి కల్పనలో భాగంగా ఉచితంగా అందించే చేప పిల్లల పంపిణీ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం చ ర్యలు తీసుకోవడం లేదు. కేసీఆర్ ప్రభుత్వం మత్స్యకారుల జీవితాల్లో వెలుగులు నింపడానికి ఉచితంగా చేప పిల్లలను పంపిణీ చేసింది. చేపలు పట్టడానికి వలలు, ఇతర సామగ్రి, మార్కెటింగ్ కోసం ఫోర్, టూ వీల్లర్స్ను అందజేసింది. చెరువులు, ప్రాజెక్టుల్లో చేపలు పెంచుతూ వారు ఉపాధి పొందారు. జిల్లాలో 95 మత్స్యకార సహకార సంఘా లు ఉండగా వీటిలో 4,500 మంది సభ్యు లు ఉన్నారు. గతేడాది 224 చెరువుల్లో 1.18 కోట్ల చేప పిల్లలను వదిలారు. జిల్లాలోని సాత్నాల, మత్తడి ప్రాజెక్టులతోపాటు చెరువుల్లో వేసిన చేప పిల్లలు బాగా పెరిగా యి. ఈ ఏడాది ఎండకాలంలో చేపల మా ర్కెటింగ్ ప్రారంభం కాగా మన రాష్ట్రంతోపా టు మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ రాష్ర్టాల నుంచి వ్యాపారులు వచ్చి చేపలను కొనుగోలు చేశా రు. గతేడాది చేపట్టిన చేప పిల్లలు పెంపకం వల్ల జిల్లాలో రూ.40 కోట్ల వరకు విక్రయాలు జరిగాయని అధికారులు తెలిపారు.
గతంలో కేసీఆర్ ప్రభుత్వం ఏటా వానకాలానికి ముందుగానే జిల్లాలో చేపల పెంపకానికి అనుకూలంగా ఉన్న చెరువులు, ప్రాజెక్టుల, ఇతర నీటి వనరుల వివరాలను సేకరించేలా చర్యలు చేపట్టింది. ముందుగా చెరువుల, ప్రాజెక్టులను గుర్తించి లబ్ధిదారుల సూచనల మేరకు వివిధ రకాల పిల్లలను చెరువుల్లో వదిలేవారు. పంపిణీలో భాగంగా జిల్లాకు ఎన్ని చేప పిల్లలు అవసరమనే నివేదికలు ప్రభుత్వానికి పంపేవారు. జూన్ చివరికల్లా టెండర్ ప్రక్రియ పూర్తి చేసి చేప పిల్లల పంపిణీకి అధికారులు ఏర్పాట్లు చేసేవారు. చెరువులు, ప్రాజెక్టుల నీటి నిల్వలు, సామర్థం మేరకు మత్స్యకారులకు ఉచితంగా చేప పిల్లలను బీఆర్ఎస్ ప్రభుత్వం పంపిణీ చేసింది. కట్ల, రాహు, బంగారుతీగ, మృగాల లాంటి చేప పిల్లలను చెరువుల్లో పెంచడానికి 35 ఎంఎం నుంచి 40 ఎంఎం సైజు గల పిల్లలను పంపిణీ చేశారు. వానకాలం ప్రారంభమైన దాదాపు నెల రోజులు అవుతున్నా కాంగ్రెస్ ప్రభుత్వం మత్స్యకారులకు ఉచితంగా చేప పిల్లల పంపిణీకి చర్యలు తీసుకోలేదు. ప్రభుత్వం నుంచి ఇప్పటివరకు మత్స్యశాఖ అధికారులకు ఈ ప్రక్రియకు సంబంధించిన ఆదేశాలు రాలేదు. దీంతో లబ్ధిదారులు ఆందోళన చెందుతున్నారు. ఈ ఏడాది ప్రభుత్వం నుంచి తమకు ఉచితంగా చేప పిల్లలు సరఫరా జరుగుతుందా? లేదా? అనే అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం తమకు చేప పిల్లలను పంపిణీ చేయాలని కోరుతున్నారు.
ఆదిలాబాద్ జిల్లాలో మత్స్యకారుల ఉపాధిని మెరుగుపర్చడంలో భాగంగా ఈ ఏడాది 230 చెరువుల్లో చేపల పెంపకానికి ప్రణాళికలు తయారు చేశాం. చేప పిల్లల పంపిణీ విషయంలో ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆదేశాలు రాలేదు. ఈసారి చెనాక, కొరాట ప్రాజెక్టులో చేపపిల్లలను వదలడానికి చర్యలు తీసుకుంటున్నాం. మత్స్యకారులకు ఉపాధి లభించింది.
– సాంబశివరావు, జిల్లా మత్స్యశాఖ అధికారి, ఆదిలాబాద్