ఆదిలాబాద్, జూలై 2(నమస్తే తెలంగాణ) : కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారెంటీల అమలులో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నదని, ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చక మోసం చేయాలని చూస్తున్నదని మాజీ మంత్రి, బీఆర్ఎస్ పార్టీ ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షుడు జోగు రామన్న మండిపడ్డారు. మంగళవారం బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఏడు నెలలు గడుస్తున్నా ఉచిత బస్సు ప్రయాణం తప్పా ఇతర గ్యారెంటీలను అమలు చేయడంలో విఫలమైందని ఆగ్రహం వ్యక్తం చేశారు. గృహజ్యోతి పథకంలో అర్హులుగా ఉన్న వారికి కూడా జీరో బిల్లులు రావడం లేదని, వంద రోజుల్లో ఆరు గ్యారెంటీలను అమలు చేస్తామని ప్రకటించిన సీఎం రేవంత్రెడ్డి మాట నిలుపుకోవాలని సూచించారు.
రేవంత్ గురువు చంద్రబాబు ఆంధ్రప్రదేశ్లో రూ.4 వేల పింఛన్తోపాటు ఎన్నికల హామీలు నెరవేరుస్తున్నారని, తెలంగాణలో హామీలు ఎందుకు అమలుకావడం లేదో రేవంత్రెడ్డి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. యేడాదికి రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని ప్రకటించిన కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగులను మోసం చేసిందని, ఇప్పటివరకు ఒక్క ఉద్యోగ ప్రకటన వెలువరించలేదన్నారు. వృద్ధులకు పింఛన్లు సరిగ్గా రాక ఇబ్బందులు పడుతున్నారని, అపరిశుభ్రతతో మలేరియా, డయేరియా వంటి వ్యాధులు ప్రబలే ప్రమాదం ఉందన్నారు. కేసీఆర్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు మిషన్ భగరథ పథకం ద్వారా ఇంటింటికీ తాగునీరు అందించామని, ప్రభుత్వ నిర్లక్ష్యం ఫలితంగా నీళ్లు సరిగ్గా పంపిణీ కావడం లేదన్నారు.
రుణమాఫీ, రైతుభరోసా ఇవ్వాలి
అన్నదాతలకు రుణమాఫీ, రైతుభరోసా అందించడంలో ప్రభుత్వం మోసం చేయాలని ప్రయత్నిస్తున్నదని మాజీ మంత్రి జోగు రామన్న అన్నారు. వానకాలం ప్రారంభమై నెల రోజులు దాటినా రైతుభరోసా అందలేదని, రూ.రెండు లక్షల రుణమాఫీ చేస్తానని చెప్పిన రేవంత్రెడ్డి రైతులను మభ్యపెడుతున్నారన్నారు. తెల్లరేషన్ కార్డు, కుటుంబంలో ఒక్కరికే వంటి నిబంధనలు రైతులకు శాపంగా ఉన్నాయని మండిపడ్డారు. అర్హులైన రైతులందరికీ ఈ పథకాలు అందచేయాలన్నారు. రాష్ట్రంలో పాలనను పక్కన పెట్టి ఢిల్లీ యాత్రలు చేస్తున్నారన్నారు. రైతుభరోసా విషయంలో వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు వ్యాఖ్యలు సరికాదన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం రాళ్లు, రప్పలు, సాగులో లేని భూములకు రైతుబంధు ఇచ్చిందని అంటున్నాడు. అప్పుడు మంత్రిగా ఉన్న తుమ్మల ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. ఏడు నెలల కాంగ్రెస్ పాలనలో పర్సంటేజీలు, కమిషన్ల మయంగా తయారైందన్నారు. ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారెంటీలు, 420 హామీలు అమలు చేయకపోతే ఆందోళన చేస్తామని హెచ్చరించారు. ఈ సమావేశంలో బీఆర్ఎస్ నాయకులు యూనిస్ అక్బానీ, సాజీదొద్దీన్, అలాల అజయ్, శ్రీనివాస్, మిష్షు ఉన్నారు.