లక్షెట్టిపేట, జూలై 4: పిల్లలంతా బడికి వచ్చేలా చూడాలని మంచిర్యాల కలెక్టర్ కుమార్ దీపక్ అధికారులను, ఉపాధ్యాయులను ఆదేశించారు. గురువారం బలరావుపేట గ్రామంలో ఆయన ఆకస్మికంగా పర్యటించారు. ఇటీవల ఎంపికైన అమ్మ ఆదర్శ పాఠశాలలో చేపడుతున్న అభివృద్ధి పనులను పరిశీలించారు. ఈ కలెక్టర్ మాట్లాడుతూ పనుల్లో నాణ్యత ఉండాలని, త్వరతగతిన పనులు పూర్తి చేసి అప్పగించాలన్నారు. బడిబాట కార్యక్రమంలో భాగంగా ప్రతీ పిల్లాడు బడికి వచ్చేలా అధికారులు, ఉపాధ్యాయులు, నాయకులు పిల్లల తల్లితండ్రులకు అవగాహన కల్పించాలని చెప్పారు. ఉపాధ్యాయులు కూడా పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెంచేందుకు కృషి చేయాలని సూచించారు. బాల కార్మికులుంటే వెంటనే గుర్తించి వాళ్ల తల్లితండ్రులకు కౌన్సెలింగ్ ఇవ్వడంతో పాటు వారిన బడిలో చేర్పించాలన్నారు.
అనంతరం పాఠశాల ఆవరణలోని అంగన్వాడీ కేంద్రాన్ని పరిశీలించారు. మెనూ ప్రకారం పోషక విలువలు గల ఆహారం అందజేయాలని సిబ్బందికి సూచించారు. అలాగే గ్రామంలో పర్యటించి పారిశుధ్య పనులు, తాగునీటి సౌకర్యం గురించి ప్రజలను అడిగితెలుసుకున్నారు. సీజనల్ వ్యాధులు ప్రబలకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజలకు అవగాహన కల్పించాలని అధికారులకు సూచించారు. అనంతరం పాఠశాల ఆవరణలో వనమహోత్సవం కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో మండల పంచాయతీ అధికారి అజ్మత్, పంచాయతీ సెక్రటరీ శృతి, ఈజీఎస్ ఏపీవో వెంకటరమణ, పాఠశాల ప్రధానోపాధ్యాయుడు రామస్వామి, కారోబార్ శ్రీనివాస్, టీఏ రాజన్న పాల్గొన్నారు.