రెబ్బెన, జూన్ 28 : తెలంగాణలోని బొగ్గు బ్లాకులన్నీ ప్రభుత రంగ సంస్థ అయిన సింగరేణికే నామినేషన్ పద్ధతిలో కేటాయించాలని టీబీజీకేఎస్ బెల్లంపల్లి ఏరియా ఉపాధ్యక్షుడు మల్రాజు శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. శుక్రవారం బెల్లంపల్లి ఏరియాలోని గోలేటిటౌన్షిప్లో గల టీబీజీకేఎస్ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. తెలంగాణకు చెందిన బొగ్గు బ్లాకులను వేలంలో పెట్టకుండా సింగరేణికే అప్పగించాలని, గతంలో సత్తుపల్లి, కోయగూడెం బ్లాక్లను ప్రైవేట్కు అప్పగించినా పనులు చేపట్టనీయలేదని, ఇప్పుడు శ్రావణపల్లి బ్లాక్ను స్వయంగా కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్రెడ్డి దగ్గరుండి ప్రైవేట్ వారికి అప్పగించేందుకు సహకరించడం శోచనీయమన్నారు.
దీనికి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా వంత పాడుతున్నదన్నారు. జూలైలో కార్మికులతో కలిసి పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడుతామని, 1న సింగరేణి గనులపై నల్లబ్యాడ్జీలు ధరించి అధికారులకు వినతిపత్రాలు అందిస్తామని, 3న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల దిష్టిబొమ్మలు దహనం చేస్తామని, 6న జీఎం కార్యాలయం ముందు ధర్నా నిర్వహిస్తామన్నారు.
9న గోదావరిఖని కేంద్రంగా టీబీజీకేఎస్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన చేపడుతామని, ఈ కార్యక్రమానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, కోల్ బెల్ట్ ప్రాంత ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు హాజరవుతారని, అన్ని వర్గాలు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో టీబీజీకేఎస్ నాయకులు మంగీలాల్, ఓరం కిరణ్, మారిన వెంకటేశ్వర్లు, అలవేణి సంపత్, రాజేశం, దేవేందర్, కైత స్వామి, రమేశ్, దుంపల బాపు, సంజీవ్, చందర్, మారుతి ఉన్నారు.