కౌటాల, జూన్ 26 : కౌటాల మండలంలోని ఎత్తిపోతల పథకాలను పునరుద్ధరించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ డిమాండ్ చేశారు. బుధవారం మండలంలోని సాండ్గాం, విర్దండి, గుండాయిపేట, తుమ్మిడిహట్టి ఎత్తిపోతల పథకాలను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2009 నుంచి ఈ ఎత్తిపోతల పథకాల నుంచి సాగునీరు అందిందన్నారు. ఇటీవల విర్దండి ఎత్తిపోతల మోటర్లు, ఇతర సామగ్రి చెడిపోయాయని,
గుండాయిపేట ఎత్తిపోతలలో ఇటీవల దుండగులు మోటర్లకు నిప్పు పెట్టడం, తుమ్మిడిహట్టి ఎత్తిపోతలలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లోని రాగి తీగ చోరీకి గురైనా అధికారులు చర్యలు తీసుకోవడం లేదన్నారు. వార్దా, ప్రాణహిత నదుల్లో పుష్కలంగా నీరున్నప్పటికీ సమీపంలో పంటలు నీరందక ఎండిపోవడం బాధాకరమన్నారు. వెంటనే ఎత్తిపోతల పథకాలకు మరమ్మతులు చేసి సాగునీరందించేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేదంటే రైతులతో కలిసి ధర్నాలు చేస్తామని హెచ్చరించారు. ఆయన వెంట బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు నక్క శంకర్, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, రైతులు పాల్గొన్నారు.