ఆదిలాబాద్, జూన్ 29(నమస్తే తెలంగాణ) : ఆదిలాబాద్ జిల్లా రాజకీయాల్లో చెరగని ముద్ర వేసిన మాజీ ఎంపీ రాథోడ్ రమేశ్ (57) శనివారం గుండెపోటుతో మృతిచెందా రు. ఆయన ఉట్నూర్లో ఉదయం ఒక్కసారి గా అనారోగ్యానికి గురయ్యారు. వెంటనే కుటుంబ సభ్యులు చికిత్స కోసం ఆదిలాబాద్లోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లారు. కో మాలోకి వెళ్లిన ఆయనను హైదరాబాద్కు తరలిస్తుండగా మార్గమధ్యలో ఇచ్చోడ వద్ద గుండెపోటుతో మరణించారు. తెలుగుదేశం పార్టీ నుంచి రాజకీయ జీవితం ప్రారంభించి, 35 ఏండ్లు సుదీర్ఘంగా తన రాజకీయ ప్రస్థానం కొనసాగించారు. జడ్పీటీసీ, జడ్పీ చైర్మన్, ఎ మ్మెల్యే, ఎంపీగా జిల్లా ప్రజలకు సేవలు అం దించి ప్రజల్లో మంచి నాయకుడిగా నిలిచారు.
1989లో నార్నూర్ జడ్పీటీసీగా విజయం సాధించిన ఆయన రాజకీయాల్లో అంచెలంచెలుగా ఎదిగారు. 1999లో ఖానాపూర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు. 2006లో ఆసిఫాబాద్ నుంచి జడ్పీటీసీగా గెలిచి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా పరిషత్ చైర్మన్గా ఎన్నికయ్యారు. 2009లో జరిగిన సాధారణ ఎన్నికల్లో తెలుగుదేశం నుంచి ఆదిలాబాద్ ఎంపీగా పోటీ చేసి విజయం సాధించారు.
జిల్లా వ్యాప్తంగా ఆయనకు రాజకీయ నాయకులు, అధికారులు, ప్రజలతో మంచి సంబంధాలు ఉన్నాయి. 2021లో బీజేపీలో చేరిన రాథోడ్ రమేశ్ గతేడాది నవంబరులో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఖానాపూర్ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. జడ్పీ చైర్మన్గా పనిచేసిన సమయంలో బీఆర్జీఎఫ్ ద్వారా గ్రామాల్లో రోడ్లు, మురికి కాలువలు, చెక్డ్యాంల నిర్మాణానికి విశేషంగా కృషి చేశారు. ప్రజలు, కార్యకర్తలతో మమేకమై వారి సమస్యల పరిష్కారంలో ముందుగా ఉన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీలో ఉంటూ రాష్ట్రస్థాయి నాయకుడిగా ఎదిగారు. టీడీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు సన్నిహితంగా ఉంటూ పార్టీలో కీలక పదవులు నిర్వహించారు.
రాథోడ్ రమేశ్ అకాల మరణంతో కార్యకర్తలు, అభిమానులు శోకసంద్రంలో మునిగిపోయా రు. జడ్పీ చైర్మన్ రాథోడ్ జనార్దన్, బోథ్ ఎమ్మె ల్యే అనిల్ జాదవ్లు ఉట్నూర్లోని ఆయన నివాసానికి వెళ్లి మృతదేహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. రమేశ్ మృతి తీరని లోటన్నారు. స్థానిక ఎమ్మెల్యే బొజ్జు పటేల్ కూడా సంతాపం తెలిపారు. ఉమ్మడి జిల్లాలోని బీజేపీ ముఖ్యనాయకులు, కార్యకర్తలు, ఖానాపూర్లోని అభిమానులు చివరి చూపు కోసం బారులు తీరారు. ఉట్నూర్ పట్టణంలో వ్యాపారులు సంపూర్ణంగా బంద్ నిర్వహించి తమ అభిమానాన్ని చాటారు. అభిమానుల తాకిడితో అంగడీబజార్ రద్దీగా మారింది. కాగా.. నేడు(ఆదివారం) ఉట్నూర్ ఎక్స్రోడ్లో గల ఆయన వ్యవసాయక్షేత్రంలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు.