Rathore Ramesh | ఉట్నూర్, జూన్ 30 : గిరిజన నాయకుడు, మాజీ ఎంపీ రాథోడ్ రమేశ్ అంతిమయాత్రను ఆదివారం ఉట్నూర్ మండలంలోని నాగాపూర్ గ్రామ సమీపంలో నిర్వహించారు. గుండెపోటుతో బాధపడుతూ హైదరాబాద్కు తరలిస్తుండగా కన్నుమూసిన విషయం తెలిసిందే. అనంతరం మృతదేహాన్ని ఉట్నూర్లోని ఆయన నివాసానికి తరలించి ప్రజల సందర్శనార్థం ఉంచారు. ఆదివారం చివరిచూపు చూసేందుకు జనం తండోపతండాలుగా వచ్చారు. అనంతరం ఆయన నివాసం నుంచి మండలంలోని నాగాపూర్ గ్రామం వద్ద ఉన్న ఆయన చేనులో ఖననం చేశారు. ఉట్నూర్ నుంచి సుమారు ఎనిమిది కిలోమీటర్ల మేర అంతిమయాత్రలో ప్రజలు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.
మాజీ ఎంపీ రాథోడ్ రమేశ్ అకాల మరణంతో కార్యకర్తలు, అభిమానులు శోకసంద్రంలో మునిగిపోయారు. మరణ వార్త తెలుసుకున్న కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్, మెదక్ ఎంపీ ఈటెల రాజేందర్, ఎంపీ గోడం నగేశ్, జడ్పీ చైర్మన్ రాథోడ్ జనార్దన్, బోథ్ ఎమ్మెల్యే అనీల్ జాదవ్, ఆదిలాబాద్ ఎమ్మెల్యే శంకర్, మాజీ మంత్రులు ఐకే రెడ్డి, వేణుగోపాలాచారి, మాజీ ఎమ్మెల్యే బాపూరావ్లు నివాళులు అర్పించారు. అలాగే ఉమ్మడి జిల్లాలోని బీజేపీ ముఖ్యనాయకులు, కార్యకర్తలు, అభిమానులు చివరి చూపు కోసం బారులుదీరారు. అలాగే పట్టణంలో వ్యాపారులు సంపూర్ణంగా బంద్ నిర్వహించి తమ అభిమానాన్ని చాటుకున్నారు.