- ప్రీమియం పేమెంట్లపై ఎల్ఐసీ ప్రకటన
ముంబై, డిసెంబర్ 2: డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహించడానికి ప్రభుత్వరంగ బీమా దిగ్గజం ఎల్ఐసీ మరో కీలక నిర్ణయం తీసుకున్నది. క్రెడిట్ కార్డు ద్వారా జరిపే ప్రీమియం చెల్లింపులపై విధించనున్న చార్జీలను ఈ నెల 1 నుంచి పూర్తిగా ఎత్తివేస్తున్నట్లు సోమవారం సంస్థ ప్రకటించింది. దీంతో క్రెడిట్ కార్డు ద్వారా రెన్యూవల్ ప్రీమియం, నూతన ప్రీమియం లేదా రుణాల చెల్లింపులు, పాలసీలపై తీసుకున్న రుణాలపై వడ్డీ చెల్లింపులపై అదనపు రుసుంను వసూలు చేయరు. కంపెనీ తీసుకున్న తాజా నిర్ణయంతో ఇక క్రెడిట్ కార్డు ద్వారా ఆర్థిక లావాదేవీలను ఉచితంగా జరుపుకోవచ్చును. వీటితోపాటు కార్డు రహిత చెల్లింపులు, పాయింట్ ఆఫ్ సేల్ మెషిన్ల వద్ద కార్డు డిప్/స్వైప్ ద్వారా జరిపే లావాదేవీలపై ఎలాంటి అదనపు భారం పడదని ఒక ప్రకటనలో వెల్లడించింది. అలాగే వినియోగదారుడు మైఎల్ఐసీ యాప్ను డౌన్లోడ్ చేసుకొని ప్రీమియం చెల్లింపులు జరుపుకోవచ్చునని సూచించింది.